రాజా రఘువంశీ హత్య తర్వాత సోనమ్ ఎక్కడికెళ్లింది?
మేఘాలయ పోలీసులు ఇండోర్ ఎందుకొచ్చారు? ఎవరిని కలిశారు? రఘువంశీ కుటుంబసభ్యులు ఏం చెప్పారు?;
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ(Meghalaya) హనీమూన్ మర్డర్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఇండోర్(Indore)కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ(Raja Raghuvanshi) హత్యకు గురయిన తర్వాత అతని భార్య సోనమ్(Sonam) కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కడ తలదాచుకుంది. ఎవరు ఆశ్రయమిచ్చారు? అనే వివరాలు తెలుసుకునేందుకు మేఘాలయ పోలీసులు మంగళవారం ఇండోర్కు చేరుకున్నారు. ‘‘రాజా రఘువంశీ హత్య జరిగిన తర్వాత దేవాస్ నాకా ప్రాంతంలోని ఓ ఫ్లాట్లో సోనమ్ కొన్ని రోజుల ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. అందుకే మేం ఇక్కడకు వచ్చాం,’’ అని పోలీసు అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.
పనిలో పనిగా సహకార్నగర్ ప్రాంతంలోని రాజా రఘువంశీ ఇంటిని కూడా సందర్శించారు. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. "మేఘాలయ నుంచి ముగ్గురు పోలీసులు మా ఇంటికి వచ్చారు. అరగంట పాటు మాతో మాట్లాడారు. సోనమ్ ప్రవర్తన గురించి అడిగారు. పెళ్లి తర్వాత ఆమె మాతో ఎంతకాలం ఉందని ప్రశ్నించారు?" అని అని రాజా రఘువంశీ అన్నయ్య విపిన్ రఘువంశీ చెప్పారు.
అసలు ఏం జరిగింది?
ఇండోర్కు చెందిన బిజినెస్మ్యాన్ రాజా రఘువంశీకి సోనమ్(Sonam)తో ఇటీవల పెళైంది. అయితే సోనమ్కు రఘువంశీని పెళ్లిచేసుకోవడం ఇష్టంలేదు. అప్పటికే ఆమెకు తన తండ్రి నడుపుతున్న దుకాణంలో మేనేజర్గా పనిచేసే రాజ్ కుష్వాతో చునువుగా ఉండేది. పెద్దల మాటకు విలువిచ్చి తొలుత రఘువంశీని పెళ్లిచేసుకునేందుకు అంగీకరించిన సోనమ్.. ఆ తర్వాత సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వా రఘువంశీని అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో కిరాయి హంతకులతో రఘువంశీని చంపించేందుకు పథకం వేశారు. ప్లాన్లో భాగంగా మే 23న హనీమూన్ పేరిట సోనమ్ రఘువంశీని మేఘాలయకు తీసుకెళ్లింది. సోనమ్ ఇస్తున్న సమాచారంతో కిరాయి హంతకులు వాళ్లిదరిని ఫాలో అయ్యేవారు. సోనమ్, రఘువంశీ కొండప్రాంతంలో ఏకాంతంగా ఉండగా.. కిరాయి హంతకులు అక్కడికి చేరుకుని రఘువంశీని కత్తితో వెనక నుంచి పొడిచారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని లోయలోకి తోసేశారు.
ఆ తర్వాత నిందితులతో పాటు సోనమ్ కొద్ది రోజుల పాటు కనిపించలేదు. ఇటు భార్యభర్తల నుంచి ఏ సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కొన్ని రోజులకు కుళ్లిపోయిన రాజా రఘువంశీ మృతదేహాం బయటపడడంతో సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసుల ముందు లొంగిపోయింది. దర్యాప్తులో పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి.
పోలీసుల అదుపులో నిందితులు..
రాజా రఘువంశీ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాతో పాటు మరో ముగ్గురు నిందితులు విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్ ఆనంద్ కుర్మిని తమ అదుపులో ఉంచుకున్నారు. విడివిడిగా ప్రశ్నిస్తూ హత్య చేసిన తీరుపై కూపీ లాగుతున్నారు.