బీహార్లో ఎన్డీఏ సీఎం అభ్యర్థి ఎవరు?
జేడీ(యూ) చీఫ్ నితీష్ పేరును మోదీ ప్రకటించకపోవడానికి కారణమేంటి?;
ఈ ఏడాది చివర్లో బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అధికార ఎన్డీయేలో అనిశ్చితి నెలకొంది. ప్రధాని మోదీ (PM Modi) ఇటీవల చేపట్టిన రాష్ట్ర పర్యటనలో కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఎన్డీఏ కూటమితో జతకట్టిన ముఖ్యమంత్రి నితీష్ (Nitish Kumar) ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలల్లో వీరి బంధం కొనసాగుతుంది. అయితే అధికారంలోకి తిరిగి వస్తే ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రశ్నగా మిగిలిపోయింది.
నితీష్ను పక్కన పెడతారా?
నితీష్ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఆయనను పక్కన పెడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా తమ పార్టీ నాయకుడిని చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు మోదీ మౌనాన్ని బట్టి తెలుస్తోంది. సీఎం అభ్యర్థిత్వంపై జేడీ(యూ) నాయకులు, నితీష్ కుమారుడు నిషాంత్ పదే పదే డిమాండ్ చేస్తున్నా.. ప్రధాని మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. బీహార్లోని రోహ్తాస్ జిల్లా బిక్రమ్గంజ్లో మే 30వ తేదీన జరిగిన ర్యాలీలో నితీష్ కుమార్ను సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని NDA నాయకులు, ముఖ్యంగా JD(U) నాయకులు భావించారు. నెలల తరబడి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదీస్తారని అనుకున్నారు. కాని అలాంటిదేమీ జరగలేదు. ఈ ఏడాది మోదీ బీహార్లో నాలుగు సార్లు పర్యటించినా..ఆయన ఎక్కడా కూడా సీఎం అభ్యర్థి గురించి ప్రకటన చేయకపోవడంతో నితీష్కు ఈ సారి సీఎం కాలేరా? అన్న సందేహం ప్రజలను వెంటాడుతుంది.
మోదీ మౌనం జేడీ(యూ) నాయకులు, కార్మికులు, మద్దతుదారులను నిరాశపరిచింది. మరోవైపు ఎన్నికల తర్వాత బీజేపీ మరో వ్యూహానికి సిద్ధమవుతుందన్న ఊహాగానాలకు ఆజ్యం పోస్తుంది.
బయటపట్టని అమిత్ షా..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీహార్లోని గోపాల్గంజ్ను మార్చిలో సందర్శించినప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఆయన కేవలం NDAకి మద్దతు ఇవ్వాలని మాత్రం ప్రజలను కోరారు.
గతేడాది ఇదే అంశంపై షా మాట్లాడారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
నితీష్ వెంటే జేడీ(యూ)..
జేడీ(యూ) నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఈ సారి కూడా నితీష్ కుమార్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షను ప్రతిబింబించేలా బీహార్లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. '25 సే 30 ఫిర్ సే నితీష్' ('2025 నుంచి 2030 వరకు మళ్ళీ నితీష్') అని భారీ హోర్డింగ్.. 'నితీష్ అందరికీ ఇష్టమైనవాడు'.. 'బీహార్ గురించి చర్చ జరిగినప్పుడు, నితీష్ కుమార్ అనే పేరు మాత్రమే ఉండాలి' లాంటి నినాదాలతో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి.
సీఎం పదవికి నితీషే సరైన వ్యక్తి..
జేడీ(యూ) నాయకులు మాత్రం నితీషే సీఎం కావాలని ఆశలు పెట్టుకున్నారు. "నితీష్ కుమార్ మరో ఇన్నింగ్స్ ఆడతాడు. ఆయన సీఎం పదవికి 'ఫిట్ అండ్ సూట్' అని అని జేడీ(యూ) నాయకుడు నీరజ్ కుమార్ పేర్కొన్నారు. జనవరి 28, 2024న నితీష్ బీజేపీతో జతకట్టిన వెంటనే జేడీ(యూ) నాయకులు.. తదుపరి ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ కుమారేనని ప్రచారం ప్రారంభించిందని విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇదే సమయంలో గత దశాబ్ద కాలంగా నితీష్ పదే పదే పార్టీలు మారుతుండడాన్ని ఇతర జేడీ(యూ) నాయకులు అంగీకరించారు. అసెంబ్లీలో బీజేపీ, ఆర్జేడీ కంటే జేడీ(యూ) ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉన్నా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కొనసాగారు. "రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయ వ్యక్తి నితీష్. ఇతర నాయకుల కంటే ఎక్కువ ప్రజాదరణ ఉన్న నాయకుడు కూడా,’’ అని బీహార్ గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రావణ్ కుమార్ పేర్కొ్న్నారు.
పార్టీ నాయకుల అభిప్రాయాలు అటుంచితే..2005 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నితీష్ కూడా.. ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్కడా చెప్పలేదు.
బీజేపీకి ఇదే సువర్ణ అవకాశమా?
నితీష్ కుమార్ స్థానంలో బీజేపీ(BJP) అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ఇది ఒక సువర్ణావకాశమని పలువురు బీహార్ బీజేపీ నాయకుల మాట. ఫలితంగా బీజేపీ మళ్ళీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందంటున్నారు.
‘‘ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకుండానే జేడీ(యూ)తో కలిసి పనిచేస్తాం. ఫలితాల తర్వాత సీఎం అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది. మా పార్టీ అనేక రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీహార్ వంతు వచ్చింది" అని వైశాలి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు రవీందర్ సింగ్ ది ఫెడరల్తో అన్నారు .
హిందీ మాట్లాడే ఈ రాష్ట్రంలో బీజేపీకి ముఖ్యమంత్రి లేని ఏకైక రాష్ట్రం బీహార్. గత డిసెంబర్లో పార్టీ సీనియర్ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అటల్ బిహారీ వాజ్పేయికి నిజమైన నివాళి అర్పిస్తామని అన్నారు. ఆ తర్వాత 24 గంటల్లోనే తన వైఖరిని మార్చుకున్నారు. అది వేరే విషయం.
‘బీజేపీకి మరో దారిలేదు’..
"జేడీ(యూ) మద్దతు లేకుండా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు." అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. "బీహార్లోని బీజేపీకి సమర్థవంతమైన నాయకుడు లేడు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోగల నాయకుడు లేడు. కుల రాజకీయాలకు ప్రాధాన్యం ఉన్న బీహార్లో ఓటర్లను ఆకర్షించడానికి నితీష్ కుమార్పై ఆధారపడటం తప్ప మరో మార్గం లేదు" అని రాజకీయ వ్యాఖ్యాత డీకే దివాకర్ ది ఫెడరల్తో అన్నారు.
JD(U)కి నాన్ యాదవ్, EBC, దళితుల బలమైన మద్దతు ఉంది. "2015 అసెంబ్లీ ఎన్నికల్లో JD(U) పొత్తు లేకుండా పోటీ చేసిన BJP ఓడిపోయింది" అని మరో విశ్లేషకుడు గుర్తుచేశారు.
అత్యధిక స్థానాల్లో పోటీ..
జూన్ మూడో వారంలో సీట్ల పంపకం ఖరారు కావచ్చు. నితీష్కు సన్నిహితుడిగా భావిస్తున్న జేడీ(యూ) నాయకుడొకరు ది ఫెడరల్తో మాట్లాడుతూ.. తన పార్టీ 243 సీట్లలో కనీసం 120 సీట్లలో పోటీ చేస్తుందని, ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నాయకులకు చెప్పారని పేర్కొన్నారు. మిగిలిన సీట్లలో బీజేపీ, జేడీ(యూ) మిత్రపక్షాలు పోటీచేస్తాయని చెప్పుకొచ్చారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) సంఖ్య 43కి తగ్గగా.. బీజేపీ 74 సీట్లు గెలుచుకుంది.