పూరీ జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం
12 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఒడిశా ప్రభుత్వం వివిధ జిల్లాల నుంచి పూరీకి సుమారు 800 బస్సులు ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వే 365 రైళ్లను నడుపుతోంది.;
ఒడిశా రాష్ట్రం పూరీ(Puri)లో జగన్నాథుని రథయాత్ర(Rath Yatra) ప్రారంభమైంది. శుక్రవారం (జూన్ 27) ఉదయం పహండి(దేవతామూర్తులను రథాల వద్దకు తీసుకెళ్లడం)తో ఈ వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
భారీ భద్రత..
దాదాపు 12 లక్షల మందికిపైగా భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. భారీ భక్తజనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా(Odisha) డీజీపీ వైబీ ఖురానియా తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్సవ పర్యవేక్షణ కోసం తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ను పరిశీలిస్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం బలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథుని రథాలను లాగడం ప్రారంభమవుతుందని జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీ తెలిపారు. 12 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఒడిశా ప్రభుత్వం వివిధ జిల్లాల నుంచి పూరీకి సుమారు 800 బస్సులను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వే 365 రైళ్లను నడుపుతోంది. ఇదిలా ఉండగా..శుక్రవారం పూరీతో సహా పలు జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, వర్షం కూడా కురిస్తుందని ఐఎండీ తెలిపింది.