డైవర్షన్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబు సిద్ధ హస్తుడు : వైఎస్‌ జగన్‌

సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన ఫెయిల్‌ అయింది. తమ మీద బురద జల్లేందుకు అన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు.

Update: 2024-09-20 13:35 GMT

అన్ని రంగాల్లో ఫెయిల్‌ అయిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటి నుంచి గట్టెక్కేందుకు అన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని, ఈ రకమైన డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని, ఆయనకు మించి ఎవ్వరూ చేయలేరని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శలు గుప్పించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో అరాచక పాలన సాగుతోందని, దీనిపై ఢిల్లీలో ధర్నాలు చేపట్టామని, దేశంలోను, రాష్ట్రంలోను అది చర్చగా మారుతుందనే దుర్బుద్దితో దానిని డైవర్షన్‌ చేసేందుకు కుట్రలు చేశారన్నారు. మదనపల్లెలో ఫైల్స్‌ కాలిపోయాయనే అంశాన్ని క్రియేట్‌ చేసి దాంతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీసారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, ట్రిపుల్‌ ఐటీలతో పాటు గోరు ముద్ద వంటి కార్యక్రమాల్లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి ఎంతో మంది పిల్లలు అన్యాయమైన పరిస్థితుల్లో ఆసుపత్రుల పాలయ్యారని అన్నారు. దీనిని డైవర్షన్‌ చేసేందుకు సీఎం చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయ్యి 30 ఏళ్లైందనే సెలబ్రేషన్స్‌తో దానిని డైవర్షన్‌ చేశారని మండి పడ్డారు. చంద్రబాబును స్కిల్‌ స్కామ్‌లో అరెస్టు చేశారని, మార్గదర్శి నేరాలను బయట పెట్టారని కారణంతో సంబంధి అధికారులను సీఎం చంద్రబాబు చేస్తున్న వేధింపులపై సర్వత్రా విమర్శలు వస్తుంటే, దానిని డైవర్షన్‌ చేయడానికి ముంబాయి నుంచి ఒక సైడ్‌ ఆర్టిస్ట్‌ను అడ్డు పెట్టుకొని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు.
భారీ వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని, కనీసం అధికారుల రివ్యూ కూడా నిర్వహించ లేదన్నారు. విపత్తుల నుంచి బయట పడేందుకు సమయం ఉన్నా కూడా సమీక్షలు నిర్వహించక పోవడం వల్ల, ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే విజయవాడలో వరదలు చోటు చేసుకున్నాయన్నారు. మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్స్‌ను క్రియేట్‌ చేసి వరద నష్టానికి సీఎం చంద్రబాబు కారకురయ్యారని విమర్శించారు. తన కారణం వల్ల సంభవించిన వరదల విపత్తు, నష్టంపై సీఎం చంద్రబాబుపై ప్రజల్లో విమర్శలు వినిపించాయని, దానిని డైవర్షన్‌ చేసేందుకు ప్రకాశం బ్యారేజీ బోట్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఆ బోట్లన్నీ అక్కడ ఎందుకున్నాయని ప్రశ్నించారు. చంద్రబాబు వాటికి ఎందుకు అనుమతులిచ్చారని ప్రశ్నాంచారు.
విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం మీద, కొత్త మెడికల్‌ కళాశాలలు ప్రైవేటు పరం చేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న ఆలోచనలపై ఆందోళనలు జరుగుతుంటే ఆ అంశాలను మళ్లించడానికి డైవర్షన్‌ పాలిటిక్స్‌ను తెరపైకి తెచ్చారన్నారు. ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్‌ అంశాన్ని తెరపైకి తెచ్చి స్టీల్‌ అమ్మకం, మెడికల్‌ కళాశాలల ప్రైవేటు పరం వంటి కీలక అంశాలను డైవర్ట్‌ చేశారని మండిపడ్డారు. ఇలా తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని జగన్‌ విమర్శలు గుప్పించారు. దీనిపైన ప్రజలు ఆలోచనలు చేయాలని కోరారు.
Tags:    

Similar News