ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మంగళవారం మరో మృతదేహం లభించింది.టన్నెల్ కూలిన ప్రాంతంలో మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించిందని సహాయ సిబ్బంది చెప్పారు.;

Update: 2025-03-25 03:08 GMT

ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశంతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో సహాయ పనులను ముమ్మరం చేశారు. మంగళవారం టన్నెల్ లోపల సహాయ పనులు చేస్తున్న సిబ్బందికి కన్వేయర్‌ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మృతదేహం కనిపించింది. మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం వెలుగుచూసిందని ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన ఓ అధికారి చెప్పారు. రెస్క్యూ బృందాలు మంగళవారం మృతదేహాన్ని వెలికితీయడంతో ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభించినట్లయింది. గతంలో గుర్ ప్రీత్ సింగ్ మృతదేహం మార్చి 9వ తేదీన లభ్యమైంది.మంగళవారం లభించిన మృతదేహం ఎవరిదనేది గుర్తించాల్సి ఉంది. ఫిబ్రవరి 22వతేదీన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలి 8 మంది కార్మికులు జాడ లేకుండా పోయారు.


మధ్యాహ్నం వరకు మృతదేహాన్ని బయటకు తీసుకువస్తాం : అర్వింద్ కుమార్ 

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో జాడ లేకుండా పోయిన వారిలో ఒక మృతదేహాన్ని తమ సహాయ సిబ్బంది గుర్తించిందని తెలంగాణ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు టన్నెల్ నుంచి బయటకు తీసుకువస్తామని ఆయన చెప్పారు. మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చాక ఎవరిదనేది గుర్తిస్తామని ఆయన తెలిపారు. 


మరో ఆరుగురి కోసం కొనసాగుతున్న తవ్వకాలు
సీఎం ఆదేశంతో ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సహాయ పనులు చేపట్టారు. పలు విభాగాలకు చెందిన సిబ్బంది షమాయ పనులను మంగళవారం నుంచి ముమ్మరం చేశారు. రెండు మృతదేహాలు లభించడంతో మరో ఆరుగురి మృతదేహాల కోసం సహాయ సిబ్బంది గాలిస్తున్నారు. సహాయ పనులను వేగిరం చేసి ఏప్రిల్ 10వతేదీలోగా మరో ఆరుగురి మృతదేహాలను వెలికి తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సహాయ చర్యల్లో 25 ఏజెన్సీలు

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎం సీఎస్ ను ఆదేశించారు. టన్నెల్ లోపల మృతదేహాలను వెలికితీసేందుకు కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలతో పాటు ప్రైవేటు సంస్థలన్నీ కలిపి 25 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని అధికారులు చెప్పారు.మొత్తం 700 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ లో నిమగ్నమైనట్లు వారు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్ గా గుర్తించినట్లు చెప్పారు. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీంతో మృతదేహాలను వెలికితీయడం కోసం సిబ్బంది శ్రమిస్తున్నారు.



Tags:    

Similar News