గనుల శాఖ వెంకటరెడ్డి అరెస్ట్, విజయవాడకు తరలింపు

అవినీతి గనిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ గనుల శాఖ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) వి.జి. వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్ట్ చేశారు.

Update: 2024-09-27 03:33 GMT

అవినీతి గనిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ గనుల శాఖ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) వి.జి. వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు ఆయన కోసం వెతుకుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఆయన్ను సెప్టెంబర్ 27న అంటే ఈవేళ విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటికే ఆయన చాలా సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయనే ఏసీబీ అధికారులకు లొంగిపోయారని కొందరు చెబుతుండగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.

వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా.. అనేది తేలాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. వెంకట రెడ్డిని శుక్రవారం వేకువజామున విజయవాడకు తీసుకువచ్చారు. ఈవేళ మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.
కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన ఉద్యోగి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ వచ్చారు. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థతో కలిసి ప్రభుత్వ ఖజానాకు రూ.800కోట్ల నష్టం చేకూర్చారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ శాఖలో అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయనపై కేసులు పెట్టింది. ఇప్పుడు అరెస్ట్ చేసింది.
వెంకట రెడ్డిపై ఆగస్టు 31న కేసు నమోదు అయింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు కడప, తిరుపతి, విజయవాడతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో గాలించింది. అయినా దొరకలేదు. విదేశాలకు పారిపోయినట్టు వార్తలు వచ్చాయి.
ఇదే సమయంలో వెంకట రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఏసీబీ... ఆయనకు బెయిల్‌ రాకుండా అడ్డుపడింది. ఈనేపథ్యంలో లొంగిపోయారని కూడా ఓ కథనం.
మాజీ సీఎం జగన్ సపోర్టుతో గనులశాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకుని వెంకటరెడ్డి దోపిడీకి పాల్పడ్డారన టీడీపీ ఆరోపించింది. కుట్ర, అవినీతి, దోపిడీ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో వెంకటరెడ్డి ఏ1గా ఉండగా మరో ముగ్గుర్ని సహ నిందితులుగా పేర్కొంది.
ఇండియన్ కోస్ట్ గార్డులో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసరుగా ఉన్న వెంకటరెడ్డి ఏపీకి డెప్యూటేషన్ పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో ఆ తర్వాత గనుల శాఖకు డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా ఉంటూ అనేక అవకతవకలకు పాల్పడినట్టు ఏసీబీ ఆరోపిస్తోంది.
Tags:    

Similar News