చంద్రబాబు దూకుడుకు బనకచర్ల బ్రేకులు ?
తెలంగాణలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ పోటీచేసే విషయమై ఇక్కడి తమ్ముళ్ళతో మాట్లాడుతున్నారు;
చంద్రబాబునాయుడు దూకుడుకు బనకచర్ల ప్రాజెక్టు బ్రేకులు వేసేట్లుగానే ఉంది. ఏపీలో అధికారంలోకి రాగానే తెలంగాణలో కూడా పార్టీని పటిష్టంచేయాలని చంద్రబాబు పెద్ద ప్లాన్ వేశారు. దానికి తగ్గట్లుగానే తెలంగాణ(Telangana TDP) తమ్ముళ్ళతో అధినేత తరచూ సమావేశమవుతున్నారు. టీటీడీ ట్రస్ట్ బోర్డులో తెలంగాణ తమ్ముళ్ళకు అవకాశం కల్పించారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వనమోదు చేయిస్తున్నారు. ఈమధ్యనే జరిగిన పార్టీ మహానాడులో తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించారు. తొందరలోనే తెలంగాణలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ పోటీచేసే విషయమై ఇక్కడి తమ్ముళ్ళతో మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేస్తుందని కూడా ప్రకటించారు.
ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు సడెన్ గా బనకచర్ల ప్రాజెక్టు వివాదం మొదలైంది. ఈ వివాదం ఇపుడు ఎలాగ తయారైందంటే తెలంగాణ-ఏపీ మధ్య సెంటిమెంటు వివాదంగా మారిపోయింది. నిజానికి ఈప్రాజెక్టు వల్ల ఇటు తెలంగాణకు అటు ఏపీకి లాభంకన్నా నష్టమే ఎక్కువని రెండు రాష్ట్రాల్లోని నిపుణులూ మొత్తుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసే విషయంలో నానా అవస్తలు పడుతున్న బీఆర్ఎస్(BRS) కు బనకచర్ల బాగా లడ్డూలాగ దొరికింది. ఇంకేముంది పార్టీలో కీలకనేత తన్నీరు హరీష్ రావు(Harish Rao) రెచ్చిపోతున్నారు. పదేపదే చంద్రబాబు(Chandrababu Naidu) టేకప్ చేస్తున్న బనకచర్ల ప్రాజెక్టువల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరగుతోందని ప్రతిరోజు నానా రచ్చ చేస్తున్నారు. తమకున్న మీడియా, సోషల్ మీడియా బలంతో ఈ సెంటిమెంట్ అస్త్రాన్ని హరీష్ జనాల్లోకి బలంగా తీసుకెళ్ళారు. చంద్రబాబుతో కుమ్మక్కయి తెలంగాణకు ద్రోహంచేస్తున్నారంటు రేవంత్ ను లాగారు. దాంతో రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy) స్పందించాల్సిన అనివార్యత ఏర్పడింది.
అక్రమంగా ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టును ఎట్టిపరిస్ధితుల్లోను సాగనివ్వమని రేవంత్(Revanth) పదేపదే చెప్పాల్సొచ్చింది. అలాగే బనకచర్ల ప్రాజెక్టు విషయమై కేంద్రప్రభుత్వానికి తెలంగాణ లేఖరూపంలో ఫిర్యాదులు కూడా చేసింది. ఇపుడు విషయం ఎందాకా వెళ్ళిందంటే మళ్ళీ ఏపీకి వ్యతిరేకంగా తెలంగాణలో సెంటిమెంటు రాజుకుంటోంది. ఇపుడీ వివాదం ఎంతదాకా వెళుతుందో తెలీదుకాని ఇప్పటికైతే బీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందనే అనుకోవాలి. పార్టీని బలోపేతం చేసుకోవటంలో బీఆర్ఎస్ తనదైన మార్గంలో ముందుకు దూసుకుని వెళుతోంది. సరే, ఈ విషయంలో రేవంత్ కు వ్యక్తిగతంగా కాని లేదా కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమీలేదు. హోలు మొత్తంమీద చూస్తే తెలంగాణలో రాజుకుంటున్న సెంటిమెంటు వల్ల చంద్రబాబు దూకుడుకే బ్రేకులు పడుతున్నట్లు అనిపిస్తోంది.
సెంటిమెంటు కారణంగానే తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయిందనే అనుకోవాలి. తెలంగాణ రాజకీయాలకు అనేక కారణాల వల్ల చంద్రబాబు దూరంగా ఉంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో టీడీపీని దాని ఖర్మకు దాన్ని వదిలిపెట్టేశారనే అనుకోవాలి. అలాంటిది 2024 ఎన్నికల్లో ఏపీలో గెలవగానే తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబులో మళ్ళీ ఆశలు చిగురించాయి. ఏపీలో అధికారంలో ఉన్న కారణంగానే తెలంగాణలో కూడా పార్టీని మళ్ళీ బలోపేతం చేసేందుకు పావులు కదుపుతున్నారు.
ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎంఎల్ఏలతో చంద్రబాబు టచ్ లో ఉంటున్నారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనాధ్ గౌడ్ తో పాటు మాజీమంత్రి చేమకూర మల్లారెడ్డి తదితరులు రెగ్యులర్ గా చంద్రబాబును కలుస్తున్నారు. పరిస్ధితులు అన్నీ అనుకూలించినపుడు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీళ్ళందరూ కాకపోయినా కొందరైనా కచ్చితంగా టీడీపీలోకి వెళ్ళిపోతారనటంలో సందేహంలేదు. ఎందుకంటే వీళ్ళల్లో అత్యధికులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. వీళ్ళు ఏపార్టీలో ఉన్నా చాలామంది చంద్రబాబు మనుషులే అనటంలో సందేహం అవసరంలేదు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తానని చంద్రబాబు తరచూ చెబుతున్న మాటలు ఇలాంటి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే.
అంతాబాగానే ఉంది అనుకుంటున్న సమయంలో సడెన్ గా బనకచర్ల వివాదం ఇష్యూతో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రాజుకుంటోంది. దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో పోటీచేయటం టీడీపీకి ఇబ్బంది అవుతుంది. ఒకసారి సెంటిమెంటు తెరమీదకువచ్చి రాజుకున్నాక జనాలు లాజిక్కులను పెద్దగా గమనించరు. కాబట్టి ఈ పరిస్ధితుల్లో టీడీపీ పుంజుకోవటం కష్టమనే చెప్పాలి. మూడుమాసాల్లో స్ధానికసంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతుంది. ఈఎన్నికలు అయిపోయేవరకు బనకచర్ల ఇష్యూని బీఆర్ఎస్ లైవ్ లోనే ఉంచుతుంది. ఎందుకంటే సెంటిమెంటు ఆధారంగానే ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ కాబట్టి సెంటిమెంటును ఎంతవీలుంటే అంతా రాజేయాలని అనుకోవటంలో ఆశ్చర్యం ఏమీలేదు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు వస్తే సెంటిమెంటును అవసరమైనపుడల్లా రాజేస్తుంటునే ఉంటుంది. ఒకవేళ అనుకున్నట్లుగా సక్సెస్ కాకపోతే అప్పుడు ఏమిచేయాలో ఆలోచిస్తుంది. అప్పటివరకు చంద్రబాబు దూకుడుకు బనకచర్ల బ్రేకులు వేస్తుందనే అనుకోవాలి.