Telangana Rising Global Summit : ప్రతి అంశంలో జాగ్రత్త అవసరం: సీఎం
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. సదస్సులో పాల్గొనే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు చేయిస్తోంది. ఈ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతాన్ని హెలికాప్టర్లో పరిశీలించారు. అనంతరం సదస్సు కోసం ఏర్పాటు చేసిన ఎనిమిది ప్రాంగణాలను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అత్యుత్తమ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత వేదిక ప్రాంగణమంతా కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రతి అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా వహించాలని చెప్పారు.
సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికత ఉట్టిపడే విధంగా ఆయా అంశాలపై ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను వీక్షించారు. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు.
ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భోజన వసతి వంటి అంశాలపై సూచనలు చేశారు. ప్రాంగణంలో భద్రతా పరమైన ఏర్పాట్లతో పాటు ఫైర్ సేఫ్టీ అంశాలపైనా ఆరా తీశారు.