అమెరికాలో హైదరాబాద్ యువతి మృతి
మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి.
అమెరికాలో అల్బనీ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఉడుముల సహజారెడ్డి(24) యువతి మరణించింది. అమెరికా అల్బనీలో సహజారెడ్డి నివాసం పక్కన ఉన్న మరో భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. కాగా మంటలు చాలా వేగంగా సహజారెడ్డి ఉంటున్న అపార్ట్మెంట్కు వ్యాపించాయి. ప్రమాద సమయంలో నిద్రలో ఉన్న సహజారెడ్డి మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.
హైదరాబాద్లో నివాసం ఉంటున్న జయాకర్ రెడ్డి, శైలజల కుమార్తె సహజారెడ్డి. జయాకర్ రెడ్డి గుంటూరుపల్లికి చెందినవారు. ఆమె హైదరాబాద్లోని టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీగా పనిచేశారు. కొన్నేళ్లుగా కుటుంబం జోడిమెట్ల, వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివసిస్తోంది. జయాకర్, శైలజ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లో బీబీఎస్ కోచింగ్లో ఉంది. పెద్ద కూతురు సహజారెడ్డి, 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికాకు వెళ్లారు. సహజారెడ్డి మరణ వార్తను అధికారులు తల్లిదండ్రులకు తెలిపారు.
ఈ అగ్నిప్రమాద ఘటనపై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సహజారెడ్డి కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. “అవసరమైన సహాయం అందించడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి” అని తెలిపింది.