కవితపై మొదలైన ఎదురుదాడి..
కవిత తీరు కచ్ఛితంగా ఆక్షేపనీయం. ఇది క్షమించరాని విషయం.;
తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవిత చుట్టూ తిరుగుతున్నాయి. పార్టీ నాయకత్వాన్ని కవిత.. వ్యతిరేకిస్తున్నారని, పార్టీలో పరిస్థితులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కేసీఆర్కు ఆమె రాసిన ఆరు పేజీల లేఖ బహిర్గతం కావడంతో ఈ ఎపిసోడ్కు తెరలేచింది. అప్పటి నుంచి కవిత చేసే ప్రతి స్టేట్మెంట్ సంచలనంగా మారింది. తాజాగా గురువారం ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు చేతకావంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఇప్పటి వరకు కవిత అంశంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ కూడా స్పందించలేదు. కవిత వ్యాఖ్యలను కరెక్ట్ చేయడం కానీ, తప్పుబట్టడం కానీ ఏమీ లేదు. అలాంటిది ఇప్పుడు తొలిసారి కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ అనుచరుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఘాటుగా స్పందించారు.
అంతా సైలెంట్గా ఉన్న సమయంలో తోటి ఎమ్మెల్సీ నేత కవిత వ్యాఖ్యలను తప్పుబట్టడం, ఆమెపై కీలక వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో కవితపై ఎదురుదాడి మొదలైందనే అనుకోవాలి. రవీందర్తో మొదలైన ఎదురు దాడి ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
రవీందర్ ఏమన్నారంటే..
‘‘కవిత తీరు కచ్ఛితంగా ఆక్షేపనీయం. ఇది క్షమించరాని విషయం. ఇది పార్టీకి నష్టం కలిగించేది. లేఖలోని అంశాలు బయటకు వచ్చాయంటే దానిపై మా సారు, వారి ఫాదర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. అంత ఓపిక లేకపోతే ఎలా. దృష్టికి వచ్చింది.. అది కేసీఆర్ మాట్లాడతారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు వచ్చాయి.. దానిపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. కేసీఆర్ మీకే కాదు లక్షలాది మంది ప్రజలకు కూడా కేసీఆర్ దేవుడు. ఎందుకు అంత తీవ్ర ఆవేశం. ఈ విచారణ ఇవి పోయాక అన్నీ తేల్తాయి కదా. అన్నీ విషయాలు పార్టీ అధిష్ఠానం చూసుకుంటది. ఆ దేవుడు అనే కేసీఆర్ చూసుకుంటారు. ఆ దేవుడిపై భారమేసి ఉంచండి. అలా కాకుండా ఆ దేవుడిపైనే దండెత్తుతారా’’ అని ఆయన మండిపడ్డారు.