పర్యాటక ప్రదేశంగా మారనున్న రాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జ్ పాత రైల్వే బ్రిడ్జ్ కి కొత్త వైభవం!
అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పాత రైల్ బ్రిడ్జ్ కి మహర్థశ రానుంది.;
By : V V S Krishna Kumar
Update: 2025-06-25 13:42 GMT
అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా గోదావరి పరిసర ప్రాంతాలు సుందరరూపం దాల్చనున్నాయి.ఇందులో భాగంగా రాజమహేంద్రవరం పట్టణాన్ని కొవ్వూరును కలుపుతూ గోదావరి నదిపై 125 ఏళ్ల క్రితం నిర్మించిన రాజమండ్రి పాత వంతెన (హేవ్లాక్ బ్రిడ్జ్ ) పర్యాటక కేంద్రంగా కొత్త అందాలను సంతరించుకోనుంది.ఇప్పుడు పాత వంతెన సామర్థ్యాన్ని కూడా సాంకేతిక నిపుణుల కమిటీతో ఏపీ ప్రభుత్వం తిరిగి అంచనా వేయనుంది.
రేపు (జూన్ 26) అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు.ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను ఏపీ ప్రభుత్వానికి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు సంతరించుకోనున్నాయి.
ప్రధానంగా 2027 లో వచ్చే గోదావరి పుష్కరాలకి ముందు రాజమండ్రి పాత వంతెనను పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది.ఇంతకు ముందు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-మద్రాస్) నిపుణుల బృందం అధ్యయనం చేసి హావ్లాక్ వంతెన నిర్మాణ ఇంకా స్థిరంగా వుందని తేల్చిందని అయినా వంతెన నిర్మాణ స్థిరత్వాన్ని కొత్తగా అంచనా వేయడానికి మేము మరొక నిపుణుల కమిటీని నియమించాలని నిర్ణయించుకున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
హావ్లాక్ వంతెన సుందరీకరణ ప్రణాళికలో క్రాఫ్ట్ బజార్, ఇతర పర్యాటక ఆకర్షణలను వంతెనపై ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చేతిపనులు ,జానపద సాహిత్యంపై వివిధ ఇతివృత్తాలుగా అందంగా తీర్చిదిద్దడం కూడా ఉంటుందని దుర్గేష్ తెలిపారు.వంతెన కింద, 120 ఎకరాల గోదావరి నది ద్వీపంలో ఒక టెంట్ సిటీని నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
వారసత్వ సంపద హావ్లాక్ వంతెన
రాజమండ్రి వద్ద గోదావరి నది పై ఉన్న పాత వంతెనను హవేలాక్ (The Havelock Bridge)వంతెన అని కూడా అంటారు.2.74 కి.మీ. పొడవున నిర్మితమైన దీనిపై హౌరా , మద్రాస్ మధ్య నడిచే రైళ్ళు ప్రయణించేవి. 1897 నవంబర్ 11న ఈ వంతెన యొక్క నిర్మాణం ప్రారంభమైంది. ఆగస్టు 30, 1900న భారత రైల్వేలకు దీనిని అప్పగించారు.అప్పటి మద్రాస్ గవర్నర్ అయిన సర్ ఆర్డర్ ఎలిబoక్ హేవలాక్ పేరు మీద ఈ వంతెన హవేలాక్ వంతెన గా పిలవబడింది. ప్రస్తుతం ఈ వంతెన ఇంజనీరింగ్ పర్యాటక ప్రదేశం గా మార్చబడుతోంది.ప్రస్తుతం రాజమండ్రి వద్ద గోదావరిపై నాలుగు వంతెనలు వున్నాయి. అన్నింటికన్నా ముందుగా నిర్మించిన బిడ్జి ఈ హావ్ లాక్ వంతెన .అయితే దక్షిణ-మధ్య రైల్వే 1997లో ఈ వంతెనను రద్దు చేశాయి.పర్యాటక ప్రయోజనాల కోసం హావ్లాక్ వంతెనను యధాతధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు లో భాగంగా హావ్లాక్ వంతెన సుందరీకరణ, కడియం నర్సరీల అనుభవ కేంద్రం, నీటిపారుదల కాలువలలో బోటింగ్, నిడదవోలు వద్ద గోదావరి హారతి వంటివి ప్రతిపాదించారు.