‘బీఆర్ఎస్, జాగృతి.. రెండూ కేసీఆర్కు రెండు కళ్లు’
బీసీ బిల్లు కోసం తెలంగాణ జాగృతి గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నది.;
కేసీఆర్, ఆచార్య జయశంకర్ స్ఫూర్తితోనే జాగృతి సంస్థ ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ రెండూ కూడా కేసీఆర్కు రెండు కళ్లు లాంటివని ఆమె తెలిపారు. బంజారాహిల్స్లో కొత్తగా ప్రారంభించిన జాగృతి కార్యాలయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ. కనీసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చిలో కూర్చొనే అర్హత లేదు’’ అని అన్నారు.
‘‘తెలంగాణ గ్రహచారం బాగలేక తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలి. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం. అమరులు శ్రీకాంత చారి లేదా యాది రెడ్డి లేదా కాళోజి లేదా పీవీ నరసింహా రావు పేరు పెట్టండి. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లడని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా సీఎం కనీసం స్పంచించడం. ఎందుకు సీఎం అంత బలహీనంగా ఉన్నారు. పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారు సీఎం? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తొపాకులగూడెం నుంచి చేపట్టాలని ప్రతిపాదించారు’’ అని తెలిపారు.
‘‘కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచి చేపడుతామని చెప్పింది. పోలవరం నుంచి 200 టీఎంసీలను గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోంది. గోదావరి నీళ్లను తెలంగాణకు శాశ్వతంగా దూరంకానున్నాయి. జూన్ 2 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. ప్రతీ ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా ? కోటి ఎకరాల మాగాణం చేసిందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా ? రైతులను రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా ?’’ అని ప్రశ్నించారు.
‘‘తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా ? అది కాళేశ్వరం కమిషనా లేదా కాంగ్రెస్ కమిషనా ? ఇవాళ ప్రతీ తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడమంటే ... యావత్తు తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్లు. కేసీఆర్ పిడికిలికెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచిపోయి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దారుణం. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టబోతున్నాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది మందితో మహా ధర్నా చేపడుతాం’’ అని చెప్పారు.
‘‘బీసీ బిల్లు కోసం తెలంగాణ జాగృతి గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నది. ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు కానీ బీసీ బిల్లు మీద మాట్లాడలేదు. బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని బీజేపీని హెచ్చిరిస్తున్నాను. రైల్ రోకో వంటి కార్యక్రమాన్ని చేడుతాం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుంది. మహిళలకు రూ 2500, ఆడపిల్లలకు స్కూటీలు సాధించే వరకు పోరాటం చేస్తాం. మైనారిటీ హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తాం. జాగృతిలో మైనారిటీ హక్కల కోసం ముస్లీం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తాం. జాగృతి తరఫున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తాం’’ అని వెల్లడించారు.
‘‘మేం పోరాటం చేస్తుంటే ఓర్వలేని కొంత మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే... మరో కన్ను జాగృతి. కేసీఆర్ పై ఈగ వాలినా ఊరుకోబోము. తెలంగాణ కోసం బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం దారుణం. 8 మంది ఎంపీలను గెలిపించినా కేంద్రం నుంచి ఒక్క రూపాయిని తీసుకురాలేదు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడకపోతే తెలంగాణ జాగృతి పవర్ ను చూపిస్తాం. తెలంగాణ వాదాన్ని నిలబెట్టింది జాగృతి. జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు కావస్తుంది. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ అంశంపై అయినా బలంగా గొంతెత్తింది’’ అని అన్నారు.
‘‘తెలంగాణ జాగృతి కేసీఆర్, జయశంకర్ సార్ స్పూర్తితో జాగృతి సంస్థ పుట్టింది. తెలంగాణ సాంస్కృతిక అంశాలపై పనిచేయాలని జయశంకర్ సార్ దిశానిర్దేశం చేశారు. గతంలో అశోక్ నగర్ లో కార్యాలయం ఉండేది... ఇప్పుడు బంజారా హిల్స్ కు మార్చాము. సలహాలు, సూచనలు ఇచ్చి తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్లిన వారికి ఉద్యమాభివందనాలు. చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరగానే కేసీఆర్ చేశారు’’ అని గుర్తు చేశారు.