సమర శంఖం ఊదిన బీఆర్ఎస్
ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వం గుర్తించింది.;
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి సమర శంఖం ఊదింది. ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న కష్టాలను కడతేర్చడమే తమ లక్ష్యమని తెలిపింది. ప్రభుత్వం మారినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నారని, వాటిని పరిష్కరించడం కోసం తమ ప్రభుత్వం పోరాటానికి సన్నద్ధం అవుతోందని బీఆర్ఎస్ నేతలు పురుద్ఘాటించారు. ఉద్యోగ సంఘాల మాజీ నేతలు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పకడ్బందీ కార్యాచరణ రూపొందించేందుకు చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాడాలని ఫిక్స్ అయ్యారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
ప్రధాన ప్రతిపక్షంగా, లక్షల మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని బీఆర్ఎస్ పేర్కొంది. గత 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా సకాలంలో అందించకుండా సతాయించడం, ప్రశ్నించేందుకు ప్రయత్నం చేస్తున్న ఉద్యోగుల పైన వివిధ రకాలుగా ఒత్తిడి తేవడం వంటి అంశాలను పార్టీలోని మాజీ ఉద్యోగ సంఘాల, ఈ సమావేశానికి హాజరైన ఇతర నాయకులు కేటీఆర్, హరీష్ రావుల దృష్టికి తీసుకొచ్చారు.
రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధాప్యంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి పడుతున్న ఇబ్బందులపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హక్కులు, ఆకాంక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వం గుర్తించింది. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎల్లవేళలా ఉద్యోగుల ఆకాంక్షలు, హక్కుల పట్ల సానుభూతితో ఉంటుందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వం లక్షల మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుంటే వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశం అనంతరం, ఉద్యోగుల ఆకాంక్షల సాధన కోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఇందులో భాగంగా, ప్రస్తుతం ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న నేతలకు మద్దతుగా నిలవాలని, పార్టీలో ఉన్న ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రిటైర్డ్ నేతలను ఈ కార్యక్రమంలో కలుపుకోవాలని పార్టీ నాయకులు సూచించారు. ప్రధాన ప్రతిపక్షంగా, ఉద్యోగులకు అండగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరిస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు.