‘బీఆర్ఎస్ రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయింది’
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ట్యూటరింగ్ చేసి నడిపిస్తోందని ఎద్దేవాచేశారు.;
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎప్పుడో చచ్చిపోయిందని ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో శుక్రవారం రేవంత్ మీడియాతో మాట్లాడినపుడు జలాల పునరుజ్జీవనం పేరుతో బీఆర్ఎస్(BRS) మళ్ళీ బతకాలని ప్రయత్నిస్తున్నట్లు ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ కు బీజేపీ(BJP) ఆర్గాన్ డొనేషన్ చేస్తోందని మండిపోయారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ ట్యూటరింగ్ చేసి నడిపిస్తోందని ఎద్దేవాచేశారు. తెలంగాణలో తాజా వివాదమైన బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుతు తానే ఒకడుగు ముందుకేసి ఏపీతో చర్చలు జరుపుతానన్నారు.
బనకచర్ల(Banakacharla) డీపీఆర్ విషయంలో తెలంగాణకు ముందస్తు సమాచారం ఇచ్చుంటే ఇపుడింత వివాదం రేగుండేది కాదన్నారు. ఎవరికోసమో తమ హక్కులను వదులుకునే ప్రసక్తేలేదని రేవంత్(Revanth) చెప్పారు. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతే వరదజలాలు ఎంతన్న విషయంలో లెక్కలు తేలుతుందని తెలిపారు. ఏపీతో తాను వివాదాలను కోరుకోవటంలేదన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) కేంద్రం దగ్గరకు వెళ్ళి నేరుగా నిధులు, అనుమతులు అడుగుతున్న విషయమై అసంతృప్తి వ్యక్తంచేశారు. హరీష్ రావు(Harish Rao) పేరు ప్రస్తావించకుండానే పొడుగ్గా ఉంటే తెలివైన వాళ్ళని కొందరు అనుకుంటున్నట్లు, భ్రమల్లో ఉన్నట్లు వ్యగ్యంగా అన్నారు. విషయపరిజ్ఞానానికి మనిషి ఎత్తుతో సంబంధమే లేదని స్పష్టంగా చెప్పారు.