నిమ్మల ఏడు ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పగలరా ?
మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Rama naidu) మీడియా సమావేశంలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు చాలా విలువైనవనే చెప్పాలి;
తెలుగురాష్ట్రాల మధ్య నిత్యం ఏదో ఒక అంశంలో మంటలు మండటం మామూలైపోయింది. తాజా అంశం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టు. చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి రెడీ అవుతున్న నేపధ్యంలో బీఆర్ఎస్ అగ్రనేతలు ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు బీఆర్ఎస్(BRS) కీలక నేత హరీష్ రావు(Harish Rao) పదేపదే బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వాన్ని దోషిగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ(Telangana)కు తీవ్రనష్టం జరగబోతోందంటు నానా గోలచేస్తున్నారు. చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాడంటు నానా రచ్చచేస్తున్నారు. ఈవిషయంలోనే జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అఖిపక్ష సమావేశం జరగబోతోంది.
నిజానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగినా ఒరిగేదేమీ ఉండదు. కారణం ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ నేతలు ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడుంటారంతే. కాబట్టి అఖిలపక్ష సమవేశంలో ఏదో నిర్ణయం జరిగిపోతుందని అనుకుంటే అత్యాసనే అనుకోవాలి. కాకపోతే అందరు కలిసి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi)ని కలవాలనే తీర్మానం జరిగితే జరగచ్చు. అఖిలపక్ష సమావేశంలో ఏపార్టీ వాదన ఏమిటన్న విషయంలో క్లారిటి వస్తుంది కాబట్టి ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం మంచిదే.
అయితే సరిగ్గా ఇదేసమయంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Rama naidu) మీడియా సమావేశంలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు చాలా విలువైనవనే చెప్పాలి. మీడియా సమవేశంలో నిమ్మల డైరెక్టుగా కేసీఆర్(KCR) ను కార్నర్ చేశారు. నిమ్మల వ్యాఖ్యలు, ఆరోపణలు జాగ్రత్తగా గమనిస్తే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పకతప్పదని అనిపిస్తోంది. ఇంతకీ రామానాయుడు వేసిన ప్రశ్నలు ఏమిటి ?
1. తెలంగాణ రాజకీయ అంతర్గత అవసరాలకోసం ఏపీలో బనకచర్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ అడ్డుకోవటం ఎంతవరకు సబబు ?
2. అధికారంలో ఉన్నపుడు రాయలసీమను రతనాలసీమగా మార్చాలంటే గోదావరి వరద జలాలను మళ్ళించటం ఒకటే మార్గమని అప్పట్లో కేసీఆర్ చెప్పలేదా ?
N
3. హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Ys Jagan mohan Reddy)తో, నగిరి పర్యటనలో అప్పటి మంత్రి ఆర్కే రోజా(RK Roja) ఇంట్లో విందుసమయంలోను కేసీఆర్ మాట్లాడుతు గోదావరి వరదజలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్ కు మళ్ళిస్తామని ప్రకటించలేదా ?
4. అధికారంలోఉన్నపుడు రాయలసీమప్రాజెక్టులకు ఓకే చెప్పి ప్రతిపక్షంలోకి రాగానే పోలవరం-బనకచర్ల అనుసంధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ?
5. సముద్రంలో వృధాగా కలుస్తున్న 3వేల టీఎంసీల నీటిలో బనకచర్లకు వాడుకుంటామని చెబుతున్నది కేవలం 200 టీఎంసీ నీరేకదా ?
2016లో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎంలుగా కేసీఆర్, చంద్రబాబు పాల్గొన్న విషయాన్ని నిమ్మల గుర్తుచేశారు.
6. కృష్ణానదిలో 1000 టీఎంసీ నీళ్ళు కావాలని, గోదావరి నుండి మళ్ళించటం ఒకటే మార్గమని అప్పట్లో కేసీఆర్ చెప్పిన మాటలు సమావేశం మినిట్స్ లో నమోదవ్వటం వాస్తవం కాదా ?
7. అప్పట్లో కేసీఆర్ చెప్పిన మాటలకు ఇపుడు బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారు ? అని నిమ్మల నిలదీశారు.
రాయలసీమ దుర్భిక్ష ప్రాంతానికి గోదావరి జలాల తరలింపు ఒక్కటే మార్గమని అప్పట్లో కేసీఆర్ చెప్పిన వీడియోను నిమ్మల మీడియా సమావేశంలో ప్రదర్శించారు. కేసీఆర్-జగన్ సమావేశంలో కేసీఆర్ ఒప్పందాన్ని ప్రకటించిన జగన్ వీడియోను కూడా మంత్రి ప్రదర్శించారు. గోదావరి ఎగువ ప్రాంతంనుండి నీళ్ళు ఇచ్చేందుకు అప్పట్లో కేసీఆర్ అంగీకరించినా దిగువనుండి నీళ్ళు తీసుకుంటామంటే ఇపుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని నిమ్మల సూటిగా ప్రశ్నించారు. మరి నిమ్మల ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెబుతారా ?