తెల్లంగాణాలో నకిలీ డాక్టర్స్ లొల్లి

రోగం ఒకటైతే వైద్యం మరోటి కావడంతో చికిత్స అనేది గగనంగా మారింది.;

Update: 2025-06-16 06:53 GMT

తెలంగాణ నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది. కాసులకు కక్కుర్తిపడ్డ కొందరు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నకిలీ డాక్టర్లు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. జ్వరమొచ్చినా, జలుబు చేసినా డాక్టర్ దగ్గరికి వెళితే రోగం నయం అవుతుందని రోగుల గట్టి నమ్మకం. నకిలీ డాక్టర్ల వల్ల వారికి సరైన చికిత్స అందకుండా పోతుంది. వారికి రోగం ఒకటైతే వైద్యం మరోటి కావడంతో చికిత్స అనేది గగనంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో అనుమానిత డాక్టర్లు నడిపే కేంద్రాలపై ఇటీవలె దాడులు జరిగాయి. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి.

ఎంబిబిఎస్ పట్టా లేకుండానే చిన్న చిన్న బస్తీల్లో , గ్రామాల్లో ప్రాక్టీసు పెట్టేస్తున్న వైద్యులు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. అంతకుముందు ఎంబిబిఎస్ డాక్టర్ల వద్ద కంపౌడర్లు గా పని చేసిన వాళ్లు తమకు ఉన్న అనుభవసారంతో చిన్న చిన్న క్లినిక్ లు పెట్టి డాక్టర్ల అవతారమెత్తుతున్నారు.

ఈ నకిలీ డాక్టర్ల వద్ద ఎంబిబిఎస్ పట్టాలుండవు. అయినా తమకున్న నాలెడ్జితో ప్రాక్టీసు మొదలు పెడుతున్నారు. గుర్తింపు లేని యూనివర్శిటీల నుంచి ఏవో పట్టాలు తెచ్చుకుని రోగులకు చికిత్స ప్రారంభించేస్తున్నారు. సెలబ్రిటీలను పిలిచి హాస్పిటల్స్ ప్రారంభిస్తున్నారు. హాస్పిటల్స్ కు మందులు సరఫా చేసే డీలర్లు కూడా ఇలాంటి క్లినిక్ లు ప్రారంభించేస్తున్నారు. చిన్న చిన్న బస్తీలు, మురికి వాడల్లో ఈ హాస్పిటల్స్ ప్రారంభిస్తున్నారు. పేదరికం, నిరక్ష్య రాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలే వారి టార్గెట్ గా మారాయి.

తెల్ల కోటు , మెడలో స్కెత స్కోప్, ఆస్పత్రి బోర్డు మీద ఎమ్ బిబిఎస్ బోర్డు తెలంగాణలో సర్వ సాధారణమైంది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా ఝలిపిస్తోంది. హైద్రాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఇటీవల తనిఖీలు నిర్వహిస్తే నకిలీ డాక్టర్లు 15 మంది పట్టు బడ్డారు. డాక్టర్ ఆనంద్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రాజీవ్ నాయక్ డాక్టర్ అరుంధతి, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ శిరీష, డాక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి.

తెలంగాణ జిల్లాల్లో నకిలీ డాక్టర్లు ఉన్నట్టు మెడికల్ కౌన్సిల్ వైద్యులు నిర్వహించిన తనఖీల్లో బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 450 కేసులు నమోదైతే ఒక్క సంగారెడ్డి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. కొండా పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కె. బన్సిలాల్, ఎ. అనిల్ కుమార్ అనే వ్యక్తులు మల్కాపూర్ సెంటర్ లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుపుతున్నారు. బిఎన్ ఎస్ క్రింద వారిపై కేసులు నమోదయ్యాయి. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో బి. భాస్కర్ అనే వ్యక్తి శ్రీ సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇస్నాపూర్ క్రాస్ రోడ్ లో అతనికి సంబంధించిన ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ గూర్చి ఆరా తీసారు. గతంలో అనేకమంది తీవ్ర అనారోగ్యానికి ఈ సెంటర్ కారణమైంది. కొందరు ఇక్కడ చికిత్స తీసుకుని చనిపోయారు కూడా .

జీవన్ రెడ్డి శ్రీ శివ సాయి క్లినిక్ నడుపుతున్నాడు. పాల్తు బాబా నగమతా క్లినిక్ నడుపుతున్నాడు. పౌల్ మహేంద్ర అనే నకిలీ డాక్టర్ కాకతీయ హాస్పిటల్ నడుపుతున్నాడు. సదాశివ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జి. వెంకట స్వామి అనే వ్యక్తి బిఎఎంఎస్ పట్టాతో శ్రీ లక్ష్మి పాలి క్లినిక్ నడుపుతున్నాడు. అతనిపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. బిహెచ్ ఎంఎస్ పట్టా ఉన్న పి. హితేంద్ర అనే వ్యక్తి శ్రీ సాయి రామ్ పేరిట హాస్పిటల్ నడుపుతున్నాడు. సంగారెడ్డి జిల్లాలో మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రవీంద్ర సిద్దప్ప షాహిద్ అనే వ్యక్తి బుదేరా క్రాస్ రోడ్డులో క్లినిన్ నడుపుతున్నాడు. అతనిపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో లోకేశ్ అనే వ్యక్తి బిఎఎంఎస్ పట్టాతో బై పాస్ రోడ్డుతో లైఫ్ క్లినిక్ నడుపుతున్నాడు. సంగారెడ్డిలోని హత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ శ్రావ్య అనే మహిళ ఎంబిబిఎస్ పట్టా లేకుండానే శ్రీరామ్ హాస్పిటల్ నడుపుతోంది. డాక్టర్ పట్టా లేకుండానే అల్లోపతి వైద్యం చేస్తున్న ఈ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కె. సాయి కిరణ్ అనే వ్యక్తి బిహెచ్ఎంఎస్ అర్హతతో కెఎకె హాస్పిటల్ నడుపుతున్నాడు. ఎంబిబిఎస్ పట్టా లేకుండానే అల్లోపతి వైద్యం చేస్తున్నాడు.

మోతాదుకు మించిన డోసు

వైద్యో నారాయణ హరి అంటాం సమాజంలో వైద్యానికి ఉన్న ప్రాముఖ్యత అది. వైద్యుడిని దేవుడితో పోలుస్తాం. కానీ ఇక్కడ నకిలీ డాక్టర్ల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఏ రోగానికి ఏ వైద్యం చేయాలో వారికి తెలియదు. హై యాంటీ బయోటిక్స్ తో వైద్యం చేస్తున్నారు. కొద్ది సేపు ఉపశమనం అనిపించినా దాని సైడ్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉంటున్నాయి. తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోతున్న కేసులు ఎక్కువగానే ఉంటున్నాయి. అధికారుల్లో , ప్రజల్లో ప్రశ్నించే తత్వంలేనప్పుడు ఇటువంటి ప్రయివేటు క్లినిక్ లు పుడుతూనే ఉంటాయి. గల్లీ గల్లీకో శంకర్ దాదా ఎంబిబిఎస్ పుట్టుకొస్తారు.

 

 

నకిలీలకు శిక్షలు కఠినం

చట్ట ప్రకారం నకిలీ వైద్యుల భరతం పట్టొచ్చు అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు. . నకిలీ డాక్టర్లు స్టెరాయిడ్స్ ఎక్కువ వాడతారని ఆయన అన్నారు. ఎన్ ఎంసి చట్టం 34, 35 ప్రకారం వీరు శిక్షార్హులు అని ఆయన అన్నారు. ‘‘నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ డాక్టర్ అని నిర్ధారణ అయితే ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది’’ అని డాక్టర్ శ్రీనివాస్ ఫెడరల్ తెలంగాణతో అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇటువంటి వారిని కట్టడి చేయొచ్చు అని ఆయన తెలిపారు.

Similar News