తెలంగాణ అడవుల్లో వేట మీద వేటు ‘క్యాచ్ ద ట్రాప్’
అటవీ శాఖ విసిరిన ‘క్యాచ్ ద ట్రాప్’ అంటే ఏమిటో తెలుసా?;
By : Saleem Shaik
Update: 2025-06-02 05:32 GMT
తెలంగాణలోని అడవుల్లో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. అటవీగ్రామాల ప్రజలు జింకలు, అడవి పందులు, అడవి మేకలు, కుందేళ్లను వేటాడి తింటున్నారు. అటవీగ్రామాల్లో ప్రజలు అడవి పందులు, కుందేళ్లను వేటాడి దాని మాంసాన్ని వండుకొని తింటున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాల్లో విద్యుత్ కంచె, ఉచ్చులు ఏర్పాటు చేసి వన్యప్రాణులను వేటాడుతున్నారు. మరో వైపు వేటగాళ్లు, పులులు, చిరుతలను వేటాడి వాటి చర్మంతోపాటు గోళ్లను తీసి వాటిని గుట్టుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
వన్యప్రాణుల వేట ఉదంతాలెన్నో...
- కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం ఎల్లూరులో వేటగాళ్లు పులి చర్మం, గోళ్ల కోసం పులిని చంపారు. విద్యుత్ తీగలను అమర్చి పులిని చంపి దాని చర్మం, మీసాలు, గోళ్లు తీసుకొని పూడ్చి పెట్టారు. అటవీశాఖ అధికారులు వేటగాళ్లను అరెస్ట్ చేశారు.
- ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వాగు వద్ద వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో ఓ వన్యప్రాణి చిక్కింది. కెమెరా ట్రాప్ సాయంతో గుర్తించిన అటవీశాఖ అధికారులు దాన్ని రక్షించి అరణ్యంలోకి వదిలేశారు.
- వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల చెరువు సమీపంలో అడవి పంది, కొండగొర్రెను వేటాడి ఆటోలో తీసుకువస్తుండగా పట్టుకున్నారు.
- కాటారం, మహదేవ్ పూర్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేశారు.
- మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని కన్హర్ గావ్, తిప్పేశ్వర్, చప్రాల, ఇంద్రావతి, తడోబా అభయారణ్యాల నుంచి పులులు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులకు తరచూ వలస వస్తుంటాయి.పులుల కారిడార్ లో పులుల సంతానోత్పత్తి జరుగుతోంది. కుమురం భీం అభయారణ్యంగా ప్రకటించిన నేపథ్యంలో పులులు, చిరుతలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, కుందేళ్లు, జింకల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.
మాంసం తినడంలో దేశంలోనే తెలంగాణ టాప్ సెవెన్
దేశంలో మాంసాన్ని అధికంగా తినే రాష్ట్రాల్లో తెలంగాణ ఏడవ స్థానంలో నిలిచింది. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని జనాభాలో 97.4 శాతం జనాభా మాంసాహారాన్ని తింటున్నారని వెల్లడైంది. అంటే రాష్ట్రంలో 97 శాతం మంది జనాభా మాంసాహారాన్ని తింటున్నారని తేలింది. రాష్ట్రంలో మటన్, చికెన్, చేపలు, తినేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారని తాజా సర్వేలో వెలుగుచూసింది. అందులోనూ అటవీ గ్రామాల్లో అడవి పందులు, జింకలు, కుందేళ్లను వేటాడి తింటున్నారని సమాచారం. తెలంగాణలో ముక్క లేనిదే ముక్క దిగని పరిస్థితి ఉంది.కొందరు వేటను ఉపాధిగా మార్చుకొని వన్యప్రాణులను వేటాడి చంపి ఆ మాంసాన్ని విక్రయిస్తున్నారు.
వన్యప్రాణుల శరీర భాగాలకు డిమాండ్
అడవుల్లోని వన్యప్రాణుల శరీర భాగాలకు విదేశాల్లో డిమాండ్ పెరగడంతో వీటి వేటకు వేటగాళ్లు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. పులులు, చిరుతల చర్మం, గోళ్లు, దంతాలు, ఎముకలు,మీసాలు, ఉడుముల జననాంగాలు, పాంగోలిన్ చర్మం, ముంగిస జుట్టు, పాములు, తాబేళ్ల చర్మాలకు డిమాండ్ పెరిగింది. దీంతో వేటగాళ్లు పెట్రేగి పోతున్నారు. వేటగాళ్లను కట్టడి చేసేందుకు రాష్ట్ర అటవీశాఖ 24 గంటలు పనిచేసేలా వైల్డ్ లైఫ్ కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక అటవీ బృందాలు దాడులు చేసి వేటకు అడ్డుకట్ట వేస్తున్నాయి.
క్యాచ్ ద ట్రాప్ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి,రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అడవుల్లో వన్యప్రాణులను విద్యుత్ కంచెల సాయంతో వేటాడుతున్నారు. విద్యుత్ కంచెలు, వేటగాళ్లను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు క్యాచ్ ద ట్రాప్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేసి వన్యప్రాణుల వేటకు పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు.
వన్యప్రాణుల వేట నిరోధానికి ‘క్యాచ్ ద ట్రాప్’
అడవుల్లో వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు అటవీశాఖ క్యాచ్ ద ట్రాప్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితం ఆరంభించారు. వన సంరక్షణ యాప్ ద్వారా క్యాచ్ ద ట్రాప్ కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమం కింద అడవుల్లో వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన వలలు, ఉచ్చులు, విద్యుత్ లైవ్ వైర్లను అటవీ శాఖ అధికారులు తొలగిస్తుంటారు.దీన్నే ‘క్యాచ్ ద ట్రాప్’ అంటారు.
నీటి కుంటలు, చెరువుల వద్ద వేటగాళ్ల ఉచ్చులు
అడవుల్లో వన్యప్రాణులు నీటి కోసం చెరువులు, నీటి కుంటలు, వాగుల వద్దకు వస్తుంటాయి. నీరు తాగేందుకు వచ్చే వన్యప్రాణులను వేటగాళ్లు వేటాడేందుకు యత్నిస్తుంటారు. దీంతో అటవీశాఖ అధికారులు నీటి వనరుల వద్ద కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేయడంతో పాటు బీట్ అధికారులు గుర్తించి ఉచ్చులు, వలలను తొలగిస్తున్నారు. తమ అటవీశాఖ సిబ్బంది నిరంతరం నిఘా వేసి వేటగాళ్లను పట్టుకొని వన్యప్రాణులను పరిరక్షిస్తున్నారని అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు.
అడవుల్లో చెట్లకు కెమెరా ట్రాప్ లు
అడవుల్లో వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించడంతోపాటు వేటగాళ్లకు కట్టడి చేసేందుకు వీలుగా చెట్లకు కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశామని కవ్వాల్ పులుల అభయారణ్యం అటవీశాఖ అధికారి కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారుర.అడవుల్లో ప్రతీ రెండు కిలోమీటర్లకు ఒక చోట కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. వీటిని జీపీఎస్ కు అనుసంధానం చేశామని తెలిపారు.
అటవీశాఖ అధికారుల నిఘా
అడవుల్లో వన్యప్రాణులను వేటాడకుండా నిరోధించేందుకు అటవీశాఖ అధికారులతో నిరంతరం నిఘా వేశారు. అటవీ సరిహద్దుల్లో బేస్ క్యాంపులు, బీట్ ఆఫీసర్లు సంచరిస్తూ ఉచ్చులు, లైవ్ విద్యుత్ వైర్లు, కంచెలు, వలలను గుర్తించి వాటిని తొలగిస్తుంటామని, ఇది రోజు వారీ కార్యక్రమం అని ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అటవీశాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్
తెలంగాణలోని అడవుల్లో వన్యప్రాణులను వేటాడే ప్రాంతాలను తాము గుర్తించి దాడులు చేస్తున్నామని అటవీశాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ అధికారి టి రమేష్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తమకు వన్యప్రాణుల వేటపై వచ్చిన ఫిర్యాదులపై తమ బృందం దాడులు చేస్తుందని చెప్పారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1072 ప్రకారం వన్యప్రాణులను వేటాడిన వేటగాళ్లపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని రమేష్ కుమార్ చెప్పారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో ఎక్కువగా కుందేళ్లు, అడవి పందుల వేట సాగుతుందని, దీనిపై తాము కేసులు నమోదు చేస్తున్నామని ఆయన వివరించారు.
వన్యప్రాణుల సంరక్షణకు 150 ప్రత్యేక బృందాలు
తెలంగాణలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులతో 150 ప్రత్యేక బృందాలను ఇటీవల రాష్ట్ర అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఈ బృందాలు వన్యప్రాణుల వేటను నిరోధించి,వేసవిలో మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నాయి.
క్యాచ్ ద ట్రాప్ ప్రోగ్రాంతో తగ్గిన వేట
తెలంగాణ రాష్ట్రంలో క్యాచ్ ద ట్రాప్ ప్రోగ్రాంతో వన్యప్రాణుల వేట తగ్గిందని అటవీశాఖ వన్యప్రాణుల విభాగం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వన్యప్రాణుల పరిరక్షణపై అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు క్యాచ్ ద ట్రాప్ ప్రోగ్రాం అమలుతో వేట నిరోధానికి తమ అటవీశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుందని శంకరన్ చెప్పారు. అడవిపై తమ అధికారులు నిరంతరం నిఘా వేసి వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.