జల వివాదాలపై ప్రత్యేక కమిటీ

గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో… కృష్ణ నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కు అంగీకారం;

Update: 2025-07-16 12:48 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖుత వ్యక్తం చేశారు. ఈ కమిటీని జులై 21లోపు ఏర్పాటు చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న వివాదాలపై అన్ని కోణాల్లో చర్చలు జరిగాయి. నదుల జలాల వినియోగం, ప్రాజెక్ట్‌ల నిర్మాణంపై కూడా రెండు రాష్ట్రాల సీఎంలు, నీటిపారుదల శాఖ మంత్రులు చర్చించారు.

ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు: నిమ్మల

తెలుగు ప్రజలంతా ఒక్కటే అన్న స్ఫూర్తితోనే సమావేశం జరిగిందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ముఖ్యంగా మూడు అంశాలపై చర్చలు జరిగాయన్నారు. రిజర్వాయర్ల ద్వారా బయటకు వెళ్లే నీటిని లెక్కలు వేసేందుకు టెలిమెట్రీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.. శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు ప్రజల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. శ్రీశైలం ప్రాజెక్ట్ కు మరమ్మత్తులు సత్వరమే చేపట్టాలని నిర్ణయించారు.. గోదావరి నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం హైదరాబాద్ లో, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

సమావేశంలో ఆమోదించిన అంశాలు..

1. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం

2. ⁠గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో… కృష్ణ నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కు అంగీకారం

3. ⁠శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం

4. ⁠ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ నియామకం.. వారం రోజుల్లో కమిటీ నియామకం

5. ⁠ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి… అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయం..

తెలంగాణ ప్రతిపాదించిన అంశాలు..

  • ఈ సమావేశంలో తెలంగాణ మొత్తం 13 అంశాలను ప్రతిపాదించింది. వాటిలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ముఖ్యంగా ఉన్నాయి.
  • దాంతో పాటుగా శ్రీశైలం నుంచి వేరే బేసిన్‌కి నీటిని తరలించడాన్ని ఏపీ వెంటనే నిలిపివేయాలి.
  • ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లకు సహకరించేలా కృష్ణా ట్రిబ్యునల్‌లో తెలంగాణకు మద్దతు ఇచ్చేలా ఏపీని ఒప్పించాలి
  • కృష్ణానదీ జలాలను వేరే బేసిన్‌కు తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలి.
  • కృష్ణా జలాలను అక్రమ తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ అంగీకరించాలి.
  • తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చించాలి.
  • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలి.
  • శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలి.
  • శ్రీశైలం డ్యాం సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాలి.
  • శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలి.
  • శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోంది.. దీనిని అడ్డుకోవాలి.
  • పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపుకు మేము సిద్ధం. అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలి.
  • సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలి.
  • ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇవ్వాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలి.
Tags:    

Similar News