ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది: రేవంత్
మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పని చేయాలి.;
తెలంగాణ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు రానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రతి నేతా సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేవంలో పలు కీలక అంశాలను చర్చించిన అనంతరం నేతలకు రేవంత్ కీలక సూచనలు చేశారు. రానున్న కాలంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్స్, జమిలి ఎన్నికలు ఇలా అనేక ఛాలెంజెస్ను మనం ఎదర్కోవాల్సి ఉందని చెప్పారు. అదే విధంగా వీలైనంత త్వరగా మార్కెట్, ఆలయ కమిటీల్లోని నామినేషన్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం పాటుపడాలని తెలిపారు. ‘‘మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పని చేయాలి. బూత్, గ్రామ, మండలస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. పార్టీ కమిటీ నాయకులు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాలు నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి. నేను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తాయి’’ అని పేర్కొన్నారు.
‘‘కార్యకర్త స్థాయి నుంచి అనేకమంది ముఖ్యమంత్రులుగా,మంత్రులుగా,పీసీసీ అధ్యక్షులుగా ఎదిగారు. పార్టీ లో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయి. నాకు కాంగ్రెస్ పార్టీ భాద్యతల తోనే ముఖ్యమంత్రి పదవి దక్కింది. పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వం లో పదవులు ఇచ్చాం. పార్టీ పదవులు వచ్చాయని పనిచేయక పోతే వారి ని పీసీసీ అధ్యక్షుడు పక్కన పెడతారు. కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి…స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలి. మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి తీసుకురావలసిన బాధ్యత మీదే. పార్టీ నిర్మాణం లో మీరు బాధ్యత తీసుకోవాలి. అధికారం వచ్చిన సంవత్సరంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 18 నెలల్లో రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాం. దేశం లో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఇంత ఖర్చు చేయలేదు’’ అని అన్నారు.
‘‘విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ చార్జీలు,40 శాతం డైట్ చార్జీలు పెంచాం. 100 ఏళ్ల కులగణన కలను నెరవేర్చాం. కులగణన చేసి మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరాం. కేంద్రం మెడలు వంచి దేశం లో కులగణన చేపట్టాలని నిర్వహించేలా చేశాం. ఎస్సీ వర్గీకరణ కోసం 35 ఏళ్ళ నుంచి పోరాటం చేశారు..అనేక మంది త్యాగాలు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యకు పరిష్కారం చూపించాం. పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చాం. పార్టీ నిర్మాణం లో క్రియాశీలక పాత్ర పోషించాలి. పార్టీ పదవి అని చిన్న చూపు చూడొద్దు..రేపు గొప్ప అవకాశాలు ఇచ్చేది పార్టీ పదవులే. 2029 లో పార్టీ 2 వ సారి అధికారం లోకి వస్తే పదవులన్నీ మీకే వస్తాయి’’ అని తెలిపారు.
‘‘పార్టీ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండాలి. 18 నెలల మన పాలన గోల్డెన్ పీరియడ్..ప్రజలలోకి తీసుకుపోవాలి. ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య అనుసంధానం గా నాయకులు ఉండాలి. 10 ఏళ్ల బీఆర్ ఎస్ పాలనకు,18 నెలల కాంగ్రెస్ పాలన పైన బహిరంగ చర్చకు సవాల్ చేయాలి. 18 నెలల్లో మన ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి’’ అని సూచిచంచారు.