‘తెలంగాణ ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పండి’

తెలంగాణలో అన్నింటికీ అనువైన వాతావరణం ఉంది. కేంద్రం ఆమోదం వస్తే అభివృద్ధిలో దూసుకెళ్తుంది.;

Update: 2025-07-17 12:40 GMT

కేంద్ర రైల్వే, ఐటీ హంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం కొనసాగింది. ఇందులో పలు కీలక అంశాలను చర్చించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సెమీకండక్టర్‌ ప్రాజెక్ట్‌లకు వీలైనంత త్వరగా ఆమోద ముద్ర వేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం, ప్రపంచ స్థాయి ప‌రిశోధ‌న‌, అభివృద్ధి కేంద్రాల తెలంగాణలో ఉన్నందున ప్ర‌తిపాదిత‌ అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) ప్రాజెక్ట్, మైక్రో LED డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం తెల‌పాల‌ని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు EMC 2.0 పథకం కింద తెలంగాణ విన‌తిని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రీజిన‌ల్ రింగు రోడ్డు స‌మీపంలో నూత‌న ఎల‌క్ట్రానిక్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

రీజిన‌ల్ రింగ్ రైలు..

తెలంగాణ‌లో రైల్వే అనుసంధాన‌త పెంపు కోసం నూత‌న ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్ రీజిన‌ల్ రింగు రోడ్డుకు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్ర‌తిపాదించామని... ఇందుకు రైల్వే బోర్డు ఇప్ప‌టికే ఫైన‌ల్ లొకేష‌న్ స‌ర్వేకు అనుమ‌తి ఇచ్చింద‌ని సీఎం తెలిపారు. రూ.8 వేల కోట్ల విలువైన ఈ రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ కు త్వ‌ర‌గా అనుమ‌తులు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. రీజిన‌ల్ రింగ్ రైలుతో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల మ‌ధ్య అనుసంధాన‌త పెర‌గ‌డంతో పాటు హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌ధాన స్టేష‌న్ల‌లో ట్రాఫిక్ ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. రీజిన‌ల్ రింగు రైలు ప్రాజెక్టుతో గ్రామీణ పేద‌రికం త‌గ్గ‌డంతో పాటు ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌వుతాయ‌ని సీఎం తెలిపారు. హైద‌రాబాద్ డ్రైపోర్ట్ నుంచి బంద‌రు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఔష‌ధాలు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌కు ఈ మార్గం దోహ‌ద‌ప‌డుతుంద‌ని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆప‌రేష‌న్స్ ను మ‌రింత స‌మ‌ర్థంగా నిర్వ‌హించేందుకు కాజీపేట రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రి సీఎం అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌యాణికుల‌కు భ‌ద్ర‌త‌, వేగ‌వంత‌మైన సేవ‌లు అందించేందుకు కాజీపేట రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు. తెలంగాణ‌లో వివిధ ప్రాంతాల అనుసంధాన‌త‌, పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ‌క ఎగుమ‌తులు, దిగుమ‌తుల కోసం వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి నూత‌న రైలు మార్గాలు మంజూరు చేయాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్‌-కృష్ణా (122 కి.మీ.- అంచ‌నా వ్య‌యం రూ.2,677 కోట్లు, క‌ల్వ‌కుర్తి-మాచ‌ర్ల (100 కి.మీ.-అంచ‌నా వ్య‌యం రూ.2 వేల కోట్లు, డోర్న‌క‌ల్‌-గ‌ద్వాల (296 కి.మీ.-అంచ‌నా వ్య‌యం రూ.6,512 కోట్లు), డోర్న‌క‌ల్‌-మిర్యాల‌గూడ (97 కి.మీ.-అంచ‌నా వ్య‌యం 2,184 కోట్లు) మార్గాల‌ను వంద శాతం రైల్వే శాఖ వ్య‌యంతో మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. స‌మావేశంలో ఎంపీలు పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, కుందూరు ర‌ఘువీర్ రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ కుమార్, ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మ‌న్వ‌య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News