‘తమిళనాడు విద్యావిధానం మాకు ప్రేరణ’
తమిళనాడు ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ప్రశంసలు.
భారతదేశ చరిత్రలో తమిళనాడు స్థానం చాలా ప్రత్యేకమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరుణానిధి, అన్నాదురై, కామరాజ్ వంటి యోధులకు ఈ రాష్ట్రం జన్మస్థలమని అన్నారు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పలు కీలక విషయాలు పంచుకున్నారు.
‘‘ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషం. అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు. కరుణానిధి విజన్ను అమలు చేస్తున్న స్టాలిన్, ఉదయనిధిలను అభినందిస్తున్నా. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్ను తీసుకువచ్చారు. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తోంది. ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుంది. తమిళనాడు అవలంభిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకుతుంది. తెలంగాణలోనూ ఈ స్కీమ్ను వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ప్రారంభిస్తామని ప్రకటిస్తున్నా’’ అని అన్నారు.
‘‘నాన్ ముదలవన్ (స్కిల్ డవెలప్మెంట్) రూ.10 వేల ఉపకార వేతనం ప్రభుత్వ కళాశాలలకు వెళ్లే బాలురు, బాలికలకు ఇచ్చే ఈ స్కీమ్లు ఉండడం అదృష్టం. తమిళనాడు పేదలకు అండగా మంచి సీఎం స్టాలిన్ ఉన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రకపరమైన బలమైన సంబంధం ఉంది. 1991 సరళీకరణ తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలతో తమిళనాడులో మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందింది..తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయి’’ అని చెప్పారు.
‘‘సామాజిక న్యాయం అమలులో తమిళనాడు-తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయి. మేం కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం. మా రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీలకు, మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం. భారతీయులంతా తమిళనాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారు. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం మాకు ప్రేరణ కలిగించింది’’ అని వెల్లడించారు.
‘‘దక్షిణాదికి చెందిన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో మా ప్రభుత్వం, నేను విద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నా విద్యా శాఖను నా దగ్గరే ఉంచుకున్నాం. మా రాష్ట్రంలో నైపుణ్యత పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించాం. తెలంగాణ నుంచి ప్రతి ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. నైపుణ్యలేమితో ఉద్యోగాలు దక్కకపోతుండడంతో వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం’’ అని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, దానికి ఛైర్మన్గా ఆనంద్ మహేంద్రను నియమించాం తెలిపారు.