‘గ్రామాల్లో సైతం ఎల్ఈడీ లైట్లు వెలగాలి’
వీధి దీపాల పర్యవేక్షణ పక్కాగా ఉండాలని ఆదేశించిన సీఎంరేవంత్ రెడ్డి.;
రాష్ట్రవ్యాప్తంగా వీధి దీపాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి.. ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో.. వీధి దీపాల నిర్వహణ పక్కాగా ఉండాలని ఆదేశించారు. అలసత్వం లేకుండా ప్రతి ఒక్కరూ తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల వెలుగు విరజిమ్మాలని, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకు అప్పగించాలని చెప్పారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవసరమున్నాయో పక్కాగా అంచనా వేయాలని, ప్రతి పోల్ సర్వే చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
రాత్రి పూట ఎల్ఈడీ లైట్లు పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్ఈడీ డ్యాష్ బోర్డు మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్ కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ అధ్వర్యంలో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులకే వీటిని అప్పగిస్తే.. లైట్ల నిర్వహణ, విద్యుత్తు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్రంలో అన్ని ఎల్ఈడీ లైట్లను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 5.50 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ సీఎంకు నివేదించింది. గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టు ముగియటంతో ఇప్పుడు చాలాచోట్ల లైట్లు వెలగటం లేదని, నిర్వహణ కూడా సరిగా జరగలేదని అధికారులు నివేదించారు. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఎల్ఈడీ లైట్ల తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వనించాలని, ఏడేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని, నిర్వహణ పక్కగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించుకోవాలని సీఎం సూచించారు. ఎల్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్ ల ఏర్పాటు, నిరంతరం అవి పనిచేస్తున్నాయా లేదా, ఏయే ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలన్నారు. హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ.8 కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తుందని, విద్యుత్తు ఆదా చేసేందుకు సోలార్ పవర్ వినియోగించే అంశాన్ని, అందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
కోర్ అర్బన్ సిటీ ఏరియాతో పాటు అవుటర్ అవతల ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలతో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో కొత్త గ్రామాల విలీనం, గ్రామాల మార్పులు చేర్పులు జరిగాయని అన్నారు. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎల్ఈడీ లైట్ల అంచనా వేయాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ సిటీతో పాటు మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ లైట్లకు కూడా టెండర్లు పిలవాలన్నారు.