‘బీసీలపై కాంగ్రెస్ కుట్రలు’

కుల గణన రిపోర్ట్‌లను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.;

Update: 2025-07-23 11:07 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయంలో కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన క్యాబినెట్ అంతా కలిసి రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు అన్నది అసెంబ్లీలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అంతా ఒక బోగస్ అని, డబ్బులు దండుకోవడానికి ఆడిన ఒక నాటకమని దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీల హక్కులను కాంగ్రెస్ కాలరాస్తోందని అన్నారు.

‘‘కులగణన చేశారు. ఆ తర్వాత కమిటీ వేశారు. కులగణన పేరుతో రూ.160 కోట్లు ఖర్చు చేశారు. కుల గణన కోసం లక్ష మంది ఉద్యోగులను ఇంటింటికి తిప్పారు. ఈ కమిటీలు ఇచ్చే రిపోర్ట్ ఎవరికీ తెలియదు. సీక్రెట్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఈ రిపోర్ట్‌లను శాసనసభ, శాసనమండలి సభ్యులకు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వమిచ్చిన ఆర్డినెన్స్ పై కొర్రీలు పెట్టీ.. గవర్నర్ వెనక్కి పంపారని ప్రచారం ప్రచారం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముందు తెలంగాణ లోని బీసీల మెప్పు చెప్పాలి. ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కులగణపై జరిగిన సర్వే , కమిషన్ నివేదికలను బయటపెట్టాలి. రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్ సంగతేంటి.. గవర్నర్ వద్ద ఉన్న ఆర్డినెన్స్ సంగతి ఏంటి? వీటిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి’’ అని కోరారు.

‘‘పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో విన్యాసాలు చేస్తున్నారు. బీసీ కులగణన పై ముఖ్యమంత్రి అర్ధ సత్యాన్ని చెప్తున్నారు. రాజ్యాంగ నిబద్ధతను విస్మరించి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు అసెంబ్లీలో చెప్పాలి. రాష్ట్రపతి బిల్ వెనక్కి పంపడం, గవర్నర్ ఆర్డినెన్స్ ను వెనక్కి పంపితే మా గుండెల్లో రాయి పడటమే అవుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై రామచందర్ రావు చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అసెంబ్లీ లో చర్చ జరగాలి’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News