‘కవిత చేయని దందా లేదు’
బీజేపీ వదిలిన బాణమే కవిత.. అందులో సందేహం అక్కర్లేదన్న మధుయాష్కీ;
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రతి చోట వినిపిస్తున్న పేరు కవిత. కేసీఆర్కు రాసిన ఆరుపేజీల లేఖతో ఆమె తెలంగాణ రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయంటూ కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను లేడీ డాన్గా అభివర్ణించారు. ఆమె చేయని దందా లేదంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి కవిత చేసిన సేవ ఏంటి. తన అవినీతి సంపాదను కాపాడుకోవడానికే ‘తెలంగాణ జాగృతి’ సంస్థను బలోపేతం చేస్తున్నారు. ప్రధాన మంత్ర ినరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల కనుసనల్లోనే కవిత పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ను బలహీనపరిచి బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి ఈ ఎత్తుగడ పన్నారు. తెలంగాణ రాకముందు వసూళ్ల కోసం వాడుకున్న సంస్థే జాగృతి. తెలంగాణ వచ్చాక రైతులకు సాయం చేస్తామన్నారు. ఇప్పటివరకు బీసీ, ఎస్సీలకు నయాపైసా సాయం ఎందుకు చేయలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.
‘‘బీసీల గురించి మాట్లాడుతున్న కవిత.. జాగృతి సంస్థను బీసీల చేతిలో పెట్టాలి. ఆమె చేయని దందాలేదు. పాలుపంచుకోని స్కాం లేదు. బతుకమ్మ పేరు చెప్పి కవిత బతుకు నేర్చింది. కేసుల నుంచి తప్పించుకోవడానికి కవితకు బీజేపీ అందండలు కావాల్సిందే. అందుకే ఈ విధంగా లేఖల నాటకాలు ఆడుతున్నారు. జీఎస్టీ, దొంగ నోట్ల కుంభకోణాల్లోనూ కవితకు భాగస్వామ్యం ఉంది’’ అని ఆయన అన్నారు. "రాజీవ్ ప్రతాప్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 800 కోట్ల రూపాయలు దోచుకున్నారు. జాగృతి కోసం ఫీనిక్స్ వంటి సంస్థల నుంచి కవిత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు" అని ఆయన ఆక్షేపించారు.