తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్

రెండు వారాలకు విచారణ వాయిదా;

Update: 2025-06-18 13:07 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ప్రభుత్వంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)వేశారు. ఖాజాగూడ ప్రభుత్వ భూమి కబ్జాపై నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ పిల్ వేశారు. చెరువు ఎఫ్ టి ఎల్ కు చెందిన 27 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని వారు హైకోర్టు నాశ్రయించడం సంచలనమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్యతో డిఫెన్స్ లో పడి పోయింది. ఖాజాగూడలో  ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎనిమిది టవర్లు నిర్మించి 47 అంతస్థుల వరకు కట్టడానికి అనుమతులు తెచ్చుకున్నట్టు వారు తెలిపారు.

చీఫ్ జస్టిస్ సుజోయ్ పౌల్, జస్టిస్ రేణుకా యారాతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేసింది. ధర్మాసనం పిల్ వేసిన ఎమ్మెల్యేలకు ఓ సూచన చేసింది. ఇంత విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అయిన నేపథ్యంలో ప్రభుత్వానికి మరో మారు కొత్తగా అప్పీలు చేసుకోవాలని సూచించింది. సరైన సర్వే నెంబర్ వివరాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. హైడ్రాకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండ పోయిందని ఎమ్మెల్యేలు పిల్ లో పేర్కొన్నారు. ఈ కేసును హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.ఈ నెల చివరి వారంలో ఈ పిల్ విచారణకు రానుంది . ఎమ్మెల్యేలు జానంపల్లి అనిరుద్ రెడ్డి(జడ్చర్ల), యెన్నం శ్రీనివాస్ రెడ్డి(మహబూబ్ నగర్), కూచకుల్ల రాజేశ్వర్ రెడ్డి(నాగార్ కర్నూల్ ),బుక్యా మురళి నాయక్ (మహబూబాబాద్ )పిల్ వేసిన వారిలో ఉన్నారు.

నిర్మాణానికి సంబంధించిన అన్నిఅనుమతులు రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. సమీపంలో ఉన్న రెడ్ మిక్స్ ప్లాంట్ తొలగించాలని పిటిషనర్లు కోరారు. ఆ భూమిని ప్రభుత్వ భూమిగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్లు కోరారు. సహజ వనరులైన సరస్సులను సంరక్షించడం కోసమే ఈ పిల్ వేసినట్టు పిటిషనర్లు తెలిపారు. మొత్తం 50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది టవర్లు నిర్మిస్తున్నారని వారు పిల్ లో పేర్కొన్నారు.

Similar News