శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కూలి జరిగిన ప్రమాదంలో ఏడుగురు సజీవ సమాధి అయినట్లే. వారి ఆచూకీ నెలరోజులైనా తెలియడం లేదు. దానికి తోడు వారి కోసం టన్నెల్ లోపల అన్వేషించడం కష్టమని, అక్కడ పై కప్పుకూలిపోయే ప్రమాదం ఉన్నందున మొండిగా ముందుకు పోతే, రెస్క్యూ కార్మికులు మరో ప్రమాదం లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మాత్రం గల్లంతైన ఏడుగురి కోసం అన్వేషణ కొనసాగించాల్సిందే అంటున్నారు.
టన్నెల్ ప్రమాదంలో మొత్తం ఏనిమిది మంది చిక్కుకుపోయారు. ఇందులో ఒక్కరి మృతదేహం దొరికింది. ఇంకా ఏడురురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
టన్నెల్ లోపుల ప్రమాదం జరిగిన ప్రాంతంలో చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరమని వివిధ విభాగాల నిపుణులు నివేదించారు. టన్నెల్ కూలిన ప్రాంతంలో ఇంకా కూలే అవకాశం మెండుగా ఉందని నిపుణులు చెప్పడంతో అధికారులు ఇప్పటికే ఇనుప కంచెతో ప్రమాదం జరిగిన చోట టన్నెల్ ను మూసివేశారు.
- ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం,సహాయక చర్యల పురోగతిపై సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.సహాయ పనుల గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
- ఎస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ పనులను(SLBC Relief Work) కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. ( Revanth Reddy Orders) సహాయక చర్యల పర్యవేక్షణకు సీనియర్ ఐఎఎస్ అధికారి శివశంకర్ ను నియమించాలని సీఎం కోరారు.
టన్నెల్ శిథిలాల్లోనే ఏడుగురి సమాధి
ఎస్ఎల్బీసీ టన్నెల్లో గల్లంతైన ఏడుగురి మృతదేహాలు అందులో శిథిలాల కింద సమాధి అయ్యారని, వారిని వెలికితీయడం సమస్యగా మారిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు.మృతదేహాల వెలికితీత ప్రయత్నాలు విఫలం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. టన్నెల్ లోపల చిక్కుకున్న ఎనిమిది మందిలో ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. సొరంగం తవ్వకాల పనులు ఇప్పట్లో మళ్లీ పునరుద్ధరించే అవకాశం లేదని నిపుణులు సీఎంకు వివరించి చెప్పారు. దీంతో టన్నెల్ లోపల సహాయ పనులను కొనసాగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
నిపుణుల కమిటీ సూచనల ప్రకారం సహాయ పనులు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ పనులను వివిధ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయ పనులు కొనసాగించడానికి కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సీఎం సూచించారు. నిపుణుల కమిటీ సూచనలు తీసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ లో ముందుకు వెళ్లాలని కోరారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని నియమించాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. దీనిపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ కు సీఎం సూచించారు.
నిరంతరాయంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో నీ డీ 1, డీ 2 ప్రదేశాలలో మట్టి తవ్వకాల, ఊట నీటిని బయటకు పంపే ప్రక్రియ నిరంతరాయంగా వేగంగా జరుగుతున్నాయని,సహాయక బృందాలు పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. టన్నెల్ లో అత్యంత ప్రమాద ప్రదేశంగా భావిస్తున్న ప్రాంతంలో తప్పా మిగిలిన ప్రదేశాల్లో సహాయక పనులను వేగవంతం చేసినట్లు నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు సంఘటన జరిగిన నాటి నుంచి అవిశ్రాంతంగా ప్రతికూల పరిస్థితుల్లో 24 గంటల పాటు సహాయక చర్యల్లోపాల్గొంటున్నాయి. టన్నెల్ లోపల ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం,సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ అభినందించారు.
టీబీఎం కత్తిరించారు...
టన్నెల్ బోరింగ్ మెషీన్ ను కత్తిరించిన భాగాలను పక్కకు తొలగిస్తూ వాటర్ జెట్ ద్వారా బురదను తొలగించారు. ఎస్కవేటర్ల ద్వారా మట్టిని కన్వేయర్ బెల్ట్ గుండా బయటికి తరలించే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ ,దక్షిణ మధ్య రైల్వే బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.
మృత దేహాలను వెలికి తీస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న ఏడుగురి మృతదేహాలను వెలికి తీస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సోమవారం రాత్రి మీడియాతో ఆయన మాట్లాడారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ మొత్తం 41.6 కిలో మీటర్లు అని, ఇందులో 9.5 కిలోమీటర్ల తవ్వాల్సి ఉందన్నారు. ఎక్కడైతే టన్నెల్ తవ్వకం పనులు పెండింగులో పడినాయో అక్కడ మాన్యువల్ గా టన్నెల్ తవ్వాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించి, ప్రమాద ఘటనలో చిక్కుకున్న మృత దేహాలను వెలికి తీస్తామని మంత్రి పొంగులేటి వివరించారు.