డీజీసీఏ విమాన తనిఖీలు ఇక కఠినం, పలు విమాన సర్వీసుల రద్దు

అహ్మదాబాద్ బోయింగ్ విమానం ఘోర ప్రమాదం అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తనిఖీలను కఠినతరం చేసింది.సాంకేతిక లోపాలతో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.;

Update: 2025-06-20 23:52 GMT
శంషాబాద్ విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో రద్దు అయిన ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 -8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం అనంతరం విమానాల తనిఖీలను ముమ్మరం చేశారు.శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఆర్‌జీ‌ఐఏ)నుంచి ఒక్క రోజే ఏడు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన నాలుగు అంతర్జాతీయ, మూడు దేశీయ విమాన సర్వీసులను ముందు జాగ్రత్తగా రద్దు చేశామని శంషాబాద్ లోని ఆర్‌జీ‌ఐఏ వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం ఘటన తర్వాత ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తనిఖీలను కఠినతరం చేసింది.


టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 2534 విమానం శుక్రవారం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని శంషాబాద్ లోనే నిలిపివేశారు.ఏఐ విమానంలో సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో మరో ఏఐ 2445 విమానంలో ప్రయాణికులను ముంబయికు పంపించారు. దుబాయ్, బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ రావాల్సిన థాయ్ ఎయిర్ లైన్స్ 3 జీ 329, ఏఐ2204 విమానాల్లో సాంకేతిక లోపాల వల్ల ఆయా సర్వీసులను రద్దు చేశారు.

హ్యాంగర్ లోనే పలు విమానాలు
శంషాబాద్ విమానాశ్రయంతోపాటు పలు విమానాశ్రయాల్లో విమానాల రద్దుతో విమానాలను హ్యాంగర్ లోనే ఉంచారు. దుబాయ్ నుంచి ముంబయి వెళ్లే ఎయిర్ ఇండియా 2204 , ఏఐ2872 విమానాలను రద్దు చేసిన విమానాశ్రయవర్గాలు తెలిపాయి.అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత విమానాల తనిఖీలు మరింత కఠినం చేశారని ఎయిర్ ఇండియాకు చెందిన ఓ కెప్టెన్ చెప్పారు. విమాన ప్రమాదం తర్వాత 66 విమానాలను రద్దు చేశారు.

విమానాల తనిఖీలు ఇక కఠినం
ఎయిర్ ఇండియాకు చెందిన 33 డ్రీమ్ లైనర్లలో 24 విమానాలను తనిఖీలు పూర్తి చేశారు. రెండు జెట్ విమానాలను నిర్వహణ కోసం ఢిల్లీలో ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్ జాబితా చేశారు. తనిఖీలు ముమ్మరం చేశాక మరిన్ని విమాన సర్వీసులు రద్దు అయ్యే అవకాశముందని శంషాబాద్ విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పారు.
ఎయిర్ బస్ లేదా బోయింగ్ విమానాలను ఏబీసీడీ లుగా వర్గీకరించి తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా విమానాలను నాలుగు రోజుల నుంచి 45 రోజుల దాకా హ్యాంగర్ లోనే ఉంచుతారు. తనిఖీల తర్వాత డీజీసీఏ అనుమతితోనే విమానాలు నడపనున్నారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత తరచూ విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణికులు హడలిపోతున్నారు. కొందరైతే తమ విమాన ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి.


Tags:    

Similar News