కేటీఆర్ ను విచారణకు ఏసీబీ ఎందుకు పిలిచిందో తెలుసా ?
ఫైనల్ గా మూడోసారి కేటీఆర్(KTR) ను విచారించి, కొన్ని వివరాలను క్రాస్ చెక్ చేసుకుని ఆయన వాదనను కూడా పొందుపరిచి ఛార్జిషీటు వేయాలని అధికారులు అనుకున్నారు.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ఎందుకు విచారణకు పిలుస్తున్నారో అర్ధమవుతోంది. కేటీఆర్ విదేశాల నుండి హైదరాబాదుకు తిరిగి రాగానే ఏసీబీ(Telangana ACB) విచారణకు హాజరవుతారు. దీనివెనుక విషయం ఏమిటంటే ఫార్ములా ఈ కార్(Formula E car Race) రేసులో అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ అధికారులు విచారణను దాదాపు పూర్తిచేసినట్లు సమాచారం. ఈనెలాఖరులో కోర్టులో ఛార్జిషీటు దాఖలుచేయాలని డిసైడ్ అయ్యారు. అందుకనే ఫైనల్ గా మూడోసారి కేటీఆర్(KTR) ను విచారించి, కొన్ని వివరాలను క్రాస్ చెక్ చేసుకుని ఆయన వాదనను కూడా పొందుపరిచి ఛార్జిషీటు వేయాలని అధికారులు అనుకున్నారు. అందుకనే విచారణకు పిలుస్తు కేటీఆర్ కు నోటీసులిచ్చింది.
బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే కంపెనీకి హెచ్ఎండీఏ ఖాతా నుండి కేటీఆర్ ఆదేశాలతో రు. 45 కోట్లు బదిలీ అయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుమతి లేకుండా విదేశీకంపెనీకి విదేశీకరెన్సీలో డబ్బులు చెల్లించటం నిబంధనలకు విరుద్ధం. కేటీఆర్ ఫోన్లో ఇచ్చిన ఆదేశాలతోనే తాను బ్రిటన్ కంపెనీకి నిధులు చెల్లించినట్లు మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణలో చెప్పినట్లు సమాచారం. ఫార్ములా కేసులో కేటీఆర్ తో పాటు అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ, ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అర్వింద్ కుమార్ ఆదేశాలతోనే తాను నిధులు బదిలీచేసినట్లు రెడ్డి చెప్పగా, కేటీఆర్ ఫోన్ ఆదేశాలతోనే తాను రెడ్డికి నిధులు బదిలీచేయాలని చెప్పినట్లు అర్వింద్ అంగీకరించారు.
నిధులబదిలీలో అవినీతి అంశాన్ని పక్కనపెట్టేస్తే కేటీఆర్ అధికారదుర్వినియోగానికి పాల్పడినట్లు ఇప్పటికే విచారణలో ఏసీబీ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కేటీఆర్ అధికారదుర్వినియోగానికి ఆధారం ఏమిటంటే బ్రిటన్ కంపెనీకి పౌండ్లలో రు. 45 కోట్లు చెల్లించినందుకు ఆర్బీఐ వేసిన రు. 8 కోట్ల జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. బ్రిటన్ కంపెనీకి కోట్లాది రూపాయలు చెల్లించే విషయంలో క్యాబినెట్ అనుమతి కూడా కేటీఆర్ తీసుకోలేదని తెలిసింది. బ్రిటన్ కంపెనీ సీఈవోను ఆన్ లైన్లో విచారించినపుడు కొన్ని విషయాలు తెలిసాయి. విచారణలో ముగ్గురు చెప్పిన విషయాలను ఒకసారి కేటీఆర్ ముందుంచి క్రాస్ చెక్ చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. పైగా రెండువిషయాల్లో కేటీఆర్ అధికారదుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించిందని తెలుస్తోంది. అందుకనే ఫైనల్ గా కేటీఆర్ ను విచారించి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందుకనే విచారణకు రమ్మని నోటీసులిచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ హైదరాబాదు(Hyderabad)కు తిరిగి ఎప్పుడు వస్తారు ? ఏసీబీ విచారణకు ఎప్పుడు హాజరవుతారో చూడాలి.