బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ ఇంట ఈడీ రైడ్స్

పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూధన్‌ రెడ్డి ఇంట ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

Update: 2024-06-20 08:00 GMT

పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూధన్‌ రెడ్డి ఇంట ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. వీరికి సంబంధించి పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఉదయాన్నే ప్రారంభించిన ఈ దాడులు సంతోష్ గ్రానైట్స్, ఇతర అనుబంధ సంస్థల కార్యాలయాలు, అలాగే నిందితుల బినామీల ఆస్తులతో సహా ఏడు నుండి ఎనిమిది చోట్ల తనిఖీలు నిర్వహించారు.

అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన మధుసూధన్ రెడ్డిపై పటాన్‌చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. గతంలో గూడెం మధుసూధన్ రెడ్డి తన సంస్థల ద్వారా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా, మితిమీరిన మైనింగ్‌కు పాల్పడ్డారంటూ మండల రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు అతడిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. అతని సంస్థ, సంతోష్ గ్రానైట్ మైనింగ్, ఈ ఆరోపణలకు కేంద్రంగా ఉంది. ఇందులో కేంద్ర పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు, అనుమతించబడిన పరిమితికి మించి అనధికారిక తవ్వకాలు జరుగుతున్నాయని అభియోగాలు వచ్చాయి. సంబంధిత అనుమతుల గడువు ముగిసినా కూడా మహిపాల్ రెడ్డి మైనింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని అధికారులు ఆరోపించారు.

ఇటీవల స్థానిక అధికారులు క్వారీ కార్యకలాపాలను సీజ్ చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు మధుసూధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్, చీటింగ్ ఆరోపణలపై పోలీసు కేసు నమోదైంది, ఫలితంగా అతనిని అరెస్టు చేసి అతని క్రషర్‌లను సీజ్ చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి విచారణ కమిటీ వేశారు. సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ విచారణలో లక్డారంలో మధుసూధన్‌ రెడ్డికి చెందిన కంపెనీలు నిర్వహిస్తున్న అనేక అక్రమ మైనింగ్ కార్యకలాపాలు బయటపడ్డాయి. 

Tags:    

Similar News