‘తెలుగోడికి మద్దతివ్వండి.. సుదర్శన్ రెడ్డిని గెలిపించండి’
రిజర్వేషన్లు ఎత్తేయాలన్న అజెండాతో ఎన్డీఏ ముందుకెళ్తోందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.;
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతి ఒక్కరూ ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇది రెండు రాజకీయ కూటముల మధ్య పోటీ కాదని, రెండు విరుద్ద సిద్దాంత మధ్య జరుగుతున్న మహాసంగ్రామమని రేవంత్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి పావులు కదుపుతోందని, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, వెనకబడిన వారి అభివృద్ధికి కృషి చేయాలని ఇండి కూటమి పోరాడుతునస్నాయని రేవంత్ చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇండి కూటమి సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించిందని, ఆయన కూడా తమ ఆలోచనను గౌరవించారని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్లో రేవంత్ ఓ సమావేశం నిర్వహించారు.
‘‘ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని అభినందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందరూ ఒక తాటిపైకి వచ్చి తెలుగు వారందరూ సుదర్శన్ రెడ్డి గారి కి అండగా నిలబడాలని నిర్ణయించాం. నీలం సంజీవరెడ్డి , వివిగిరి, పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి ,వెంకయ్య నాయుడు, ఎన్టీ రామారావు వంటి తెలుగు నేతలు గతం లో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారు. ఈనాడు తెలుగు నాయకులు జాతీయ రాజకీయాల్లో అంత కీలకంగా లేరు.
ఇండియా కూటమి ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గౌరవించి ఎన్నికల బరిలోకి దిగారు. సుదర్శన్ రెడ్డి పోటీ వల్ల ఎన్డీఎ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది’’ అని చెప్పారు.
‘‘రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని ఎన్డీఎ కూటమి, రాజ్యాంగాన్ని కాపాడాలని , రిజర్వేషన్లను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఇండియా కూటమి ఎన్నికల్లో దిగాయి. ఉప రాష్ట్రపతి రాజీనామా చేయడం ఆశ్చర్యకరం. ఆయన రాజీనామాను దేశ ప్రజలు గమనిస్తున్నారు. తెలుగు వ్యక్తికి జాతీయ స్థాయిలో అవకాశం వచ్చింది. తెలుగు వారి గౌరవం పెరిగేలా .. అందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డి కి అండగా నిలబడాలి. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అధ్యక్షులు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ , చంద్రశేఖర్ రావు, ఓవైసీతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులకు ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతం గా విజ్ఝప్తి చేస్తున్న’’ అని అన్నారు.
‘‘జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు తెలుగువారు కూడా ఆ స్థాయిలో ఉండాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది. 18 ఏళ్ల కు ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన ఒక వైపు.. ఓట్ చోర్ ఆలోచనతో మరో పార్టీ ఇంకో వైపు దేశంలో ఉన్నాయి. పెద్దల సభ రాజ్యసభ చైర్మన్ సీటులో గౌరవమైన వ్యక్తులు,అంబేద్కర్ విధానాలపైన సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు కూర్చుంటే పూర్తి న్యాయం జరుగుతుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సుదీర్ష అనుభవం ఉంది. ఆయన వివిధ హోదాల్లో రాజ్యంగ స్పూర్తితో పనిచేశారు’’ అని గుర్తు చేశారు.
‘‘జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. రాజ్యాంగాన్ని రక్షించే పార్టీలో ఆయన మొదటి సభ్యత్వం తీసుకున్నారు.. రాజ్యాంగాన్ని రక్షించడమే ఆయన పార్టీ. ఎజెండా, జెండా లేకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతు ఇవ్వాలి. రాజ్యాంగాన్ని రక్షిస్తే దేశాన్ని రక్షించినట్లే.. లేకుంటే దేశానికి నష్టం జరుగుతుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ని ఒక జాతీయ నాయకుడు నక్సలైట్ అని అంటున్నారు. నక్సలిజం ఒక విధానం మాత్రమే. నక్సలిజం ఫిలాసఫీ నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు.. మనకు నచ్చని ఫిలాసఫీ తో వాదించి గెలవాలి.. కాని అంతం చేస్తానంటే కుదరదు’’ అని వ్యాఖ్యానించారు.