ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా.. ఫ్యూచర్‌సిటీ శంకుస్థాపనలో రేవంత్

అందరూ సహకరించండి. చిన్నచిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందామన్న సీఎం.

Update: 2025-09-28 09:03 GMT

భారత్ ఫ్యూచర్ సిటీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్‌సిటీ నిర్మాణం పూర్తయితే.. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తానని అన్నారు. ప్రపంచ నగరాలకు పోటీగా హైదరాబాద్‌ను తీసుకెళ్తానని చెప్పారు. పెట్టుబడులకు ది బెస్ట్ డెస్టినేషన్‌గా నగరాన్ని తీర్చిదిద్దుతానని వెల్లడించారు. ఫ్యూచర్‌సిటీతో ఫ్యూచర్ అంతా మారిపోతుందని అన్నారు. ఈ ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఏమైనా చిన్నాచితక సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని అన్నారు. ఫ్యూచర్‌సిటీ అనేది మనకోసంకాదని, భవిష్యత్ తరాల కోసమని, దీనిని అడ్డుకోవద్దని అన్నారు. గొప్ప సంకల్పంతో తలపెట్టిన ఈ కార్యక్రమానికి వరుణదేవుడు కూడా సహకరించాలని, అదే విధంగా మిగిలిన వారు కూడా సహకరించాలని కోరారు. ఈ అంశంలో రాజకీయాలు అనవసరమని అన్నారు. చాలా మంది తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తనకు భారీగా భూములు ఉండబట్టే ఈ ప్రాజెక్ట్ చేపట్టానని ఆరోపిస్తున్నారని అన్నారు. కానీ తాను మాత్రం భవిష్యత్ తరాల కోసమే ‘ఫ్యూచర్‌సిటీ’ని చేపట్టానని వివరించారు.

ఇది నాకోసం కాదు..

‘‘చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు.. నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకేదో భూములు ఉన్నాయని.. అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు.. భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం. ఆనాడు కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరానికి అంకురార్పణ చేశారు. నిజాం కాలంలో సికింద్రాబాద్ ను అభివృద్ధి చేశారు.. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, సిలికాన్ వ్యాలీ అభివృద్ధి జరిగింది. గతం నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మన భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ నగరాలు భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చర్చించుకునేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు.

అతి త్వరలో బుల్లెట్ ట్రైన్

‘‘ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉండాల్సిన అర్హతలన్నీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీ పట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం. ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది’’ అని తెలిపారు.

కోర్టులకు వెళ్లి నష్టపోవద్దు

‘‘ఇందుకు మీ అందరి సహకారం ఉండాలి.. చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. నేను కూర్చుని మీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నా. రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్లి నష్టపోవద్దు.. తక్షణమే మీ సమస్యలను పరిష్కరించాలని మా అధికారులను ఆదేశిస్తున్నా. అందరికీ న్యాయం చేయాలనేదే మా ప్రయత్నం. డిసెంబర్ నెలలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ భవనం, స్కిల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం. అప్పుడు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాం’’ అని వెల్లడించారు.

‘‘ప్రపంచంలో ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోనే కూర్చుని మాట్లాడుతా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా.. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఇక్కడ పది ఎకరాలు కేటాయించాలని భట్టి, శ్రీధర్ బాబు కు సూచన చేస్తున్నా. 2026 డిసెంబర్ లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తిచేసుకునేలా చూడాలి’’ అని సూచించారు.

Tags:    

Similar News