‘రాజ్యంగం ప్రకారమే రిజర్వేషన్ల అమలు’

దళితులు, బీసీలు సామాజిక వర్గాలకు చెందిన వారు గొర్రెలు, బర్రెలు తోలుకుంటూ, చేపలు పెంచుకుంటూ ఉండాలని మాజీ సీఎం ప్రవర్తించారన్నారు.;

Update: 2025-05-28 10:16 GMT

గత పాలకులకు కాంగ్రెస్‌కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు ఎవరూ అభివృద్ధి చెందకూడదు.. తమ కుటుంబమే శాసించాలన్న ధోరణిలో ఉంటే తమ ప్రభుత్వం మాత్రం ప్రతి వర్గం వారికి పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతి విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడట్లేదని అన్నారు. పైగా ఇప్పుడు తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే అడ్డుకోవడానికి చాలా మంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ఈ విషయంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలని కోరారు రేవంత్.

‘‘అనేక మంది మహానీయులు అయ్యారంటే అందుకు వారి చదువే కారణం కానీ కులం కాదు. మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే సత్తా చదువుకు మాత్రమే ఉంది. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోఠిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం. ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు బాగుండటం చాలా అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు చదువు వద్దు.. కుల వృత్తులే ముద్దు అని గత ప్రభుత్వం నమ్మింది. కానీ మా ప్రభుత్వం అలాకాదు’’ అని పేర్కొన్నారు.

దళితులు, బీసీలు సామాజిక వర్గాలకు చెందిన వారు గొర్రెలు, బర్రెలు తోలుకుంటూ, చేపలు పెంచుకుంటూ ఉండాలని మాజీ సీఎం ప్రవర్తించారన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయిన భావించిన ఆశలపై గత పాలకులు నీళ్లు చిలకరించారని ఆరోపించారు. గత సీఎం ఏకాడికి తన ఇంట్లో వాళ్లకి ఉద్యోగాలు వచ్చినాయా లేదా అని చూసుకున్నారు తప్పితే ప్రజల పరిస్థితి ఏంటి అని కలలో కూడా ఆలోచించలేదంటూ ఆరోపణలు గుప్పించారు. ‘‘తన ఇంట్లో వాళ్లు ఒకచోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల వ్యవధిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉంది. అందుకు తగ్గట్టుగా మా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తే కొందరు మాత్రం వాటిని అడ్డుకోవడం కోసం కుట్రలు చేస్తున్నారు. అలాంటి వారిని ప్రజలు నిలదీయాలి’’ అని కోరారు.

Tags:    

Similar News