వందకు చేరువైన తెలంగాణ రాతిచిత్రాల తావులు

ఆరువేలయేండ్ల కింది మూపురపుటెద్దుల రాతిచిత్రాలు;

Update: 2025-05-30 07:24 GMT

-శ్రీరామోజు హరగోపాల్

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లిగ్రామంలో ఓదెల మల్లన్న గుడివున్న గుట్టవద్ద 40 అడుగుల ఎత్తున్న రాతిగోడ మీద కొత్తరాతియుగంనాటి కొత్త రాతిచిత్రాలను శ్రీరామోజు హరగోపాల్, బీవీభద్రగిరీశ్, అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్ లతో కూడిన కొత్త తెలంగాణచరిత్రబృందం గుర్తించింది. వీటిలో రాతిగోడమీద మూడుతావుల మూడు మూపురపుటెద్దుల తొక్కుడుబొమ్మలు(రాక్ బ్రూయిజింగ్స్) ఉన్నాయి. రెండింటి ముందర ఇద్దరు నిలబడివున్న మనుషుల ఛాయవంటి బొమ్మలున్నాయి. ఒక ఎద్దుబొమ్మ 2అడుగులకు మించిన ఎత్తు, 4అడుగుల వెడల్పుతో, రెండవది 2అడుగుల పొడవు, 2అడుగుల వెడల్పుతో, మూడవది 2అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల వెడల్పుతో ఉన్నాయి. ఇంత పెద్దగా తొక్కుడుబొమ్మలు కనిపించడం తెలంగాణాలో రేగొండ తర్వాత ఇది రెండవసారి.

మూపురపుటెద్దులు జననాంగాలతో కనిపించడం చాల్కోలిథిక్ పీరియడ్ రాతిచిత్రాల లక్షణమని పురావస్తుశాఖ పూర్వ డెరెక్టర్ వివి కృష్ణశాస్త్రిగారు రాసారు. ఎరుపురంగు రాతిచిత్రాలున్న ఎడితనూరులో ఇటువంటి మూపురపుటెద్దులు మొదట కనిపించాయి. కొత్తరాతియుగానికి చెందిన ఈ రాక్ ఆర్ట్ తొక్కుడుబొమ్మలు ప్రస్తుతానికి 6వేల సంవత్సరాల క్రితం నాటివి. ఈ రాతిచిత్రాలను పరిశీలించిన రాతిచిత్రాల నిపుణులు, కొత్త తెలంగాణచరిత్రబృందం సలహాదారులు బండి మురళీధర్ రెడ్డిగారు వాటి కాలాన్ని నిర్ధారించారు.

ఈ రాతిచిత్రాలతావున్న గుట్టమీద కొత్తరాతియుగం నూరుడుగుంటలున్నాయి. రాతిచిత్రాలతావుకు సమీపంలో వున్న మల్లన్నగుడి ముందర 16అడుగుల ఎత్తైన నిలువురాయి(మెన్హర్) ఉన్నది. చిగురుమామిడి మండలంలో చాలాచోట్ల మెగాలిథిక్ సమాధులు, అతిపెద్ద మూతరాళ్ళు గతంలో చరిత్రబృందం గుర్తించింది. తెలంగాణ వారసత్వశాఖ ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపితే, ఇదొక చరిత్రపూర్వయుగ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసే అవకాశముంది.

Tags:    

Similar News