వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన తెలంగాణ సర్కార్

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన తెలంగాణ సర్కార్

Update: 2024-09-08 11:06 GMT

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ఆదివారం అమీన్‌పూర్ లేక్ బఫర్ జోన్‌లో ఆయనకి చెందిన అక్రమ కట్టడాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కూల్చివేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్), బఫర్ జోన్‌లలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన భాగస్వామి రమేష్ ఆక్రమణలకు పాల్పడ్డారని హైడ్రా గుర్తించింది. ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించిన వారం తర్వాత అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

అమీన్ పూర్ పెద్ద చెరువు ఆక్రమణలకు గురై కుంచించుకుపోయిందని అధికారుల సర్వేలో తేలింది. స్థానికులు, పర్యావరణ కార్యకర్తల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు అనధికార నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. పెద్దచెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రంగంలోకి దిగారు. ఆదివారం ఎఫ్‌టిఎల్ లో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చి వేశారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. అయితే ఈ ప్రహరీ గోడ ఏపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన వైసీపీ నేత, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినదని తెలుస్తోంది. వివాదాలకు కేంద్రంగా ఉన్న ఈ సరస్సు నీటి వనరుల మధ్య ఉన్న భూమి తమదేనని పేర్కొంటూ మాజీ ఎమ్మెల్యే ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

గతంలో రాంభూపాల్ రెడ్డి సరస్సు పరిసరాల్లో కొండలు, భూములు కొనుగోలు చేశారని వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మాత్రం 45 ఎకరాలకు పైగా భూమిని గ్రామస్థుల నుంచి చట్టబద్ధంగా సేకరించి అభివృద్ధి ఒప్పందాలు చేసుకున్నట్లు వాదిస్తున్నారు. అయితే సరస్సులోని 92 ఎకరాలను షికం వాటర్ బాడీగా, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లోని అదనంగా 170 ఎకరాల పట్టా భూమిని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌ అని చెబుతూ తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ, భూసేకరణలన్నీ చట్టబద్ధమైనవేనని, తన అభ్యంతరాలను అధికారులకు సమర్పించామని పేర్కొంటూ ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు. తాము డెవలప్ చేసిన లేఅవుట్‌ను 1991లోనే హెచ్‌ఎండీఏ ఆమోదించిందని, 2015లో కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) జారీ చేశారని తెలిపారు. 

Tags:    

Similar News