‘కేంద్రంతో కలిసి పనిచేస్తా.. అభివృద్ధే నా లక్ష్యం’
నిమ్జ్లో 100 ఎకరాలు భూమి కేటాయించి. నిధులు కూడా ఇస్తాం;
మెదక్ ప్రజలను కాంగ్రెస్ ఏనాటికీ మరిచిపోదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జహీరాబాద్ను గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్గా మారుస్తామని, ఆ దిశగా కృష్టి చేస్తున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో.. తమ ప్రభుత్వం విజన్ను సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు వివరించారు. జహీరాబాద్ నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్ అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే మెదక్ అని పేర్కొన్నారు. నారాయణ్ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక సమీక్ష నిర్వహించి కావాల్సిన నిధులు కేటాయిస్తామని చెప్పారు. ‘‘పటాన్చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా. ఈ ప్రాంతంలో ఇందిరమ్మ ప్రధానిగా ఉన్న సమయంలోనే అభివృద్ధి జరిగింది. సింగూరు ప్రాజెక్ట్ను ఎకో టూరిజం కింద తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే రైతులకు రుణమాఫీ చేశాం. దాంతో పాటుగా రైతు భరోసా అమలు చేశాం. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి నేను రెడీ. ఎవరు ఏమనుకున్నా? ఎన్ని కూతలు కూసినా పట్టించుకోను. పంచదార పరిశ్రమ కోసం సహకారం సంఘం ఏర్పాటు చేసుకుంటే.. నిమ్జ్లో 100 ఎకరాలు భూమి కేటాయించి. నిధులు కూడా ఇస్తాం’’ అని చెప్పారు.