‘ఇందిరమ్మ’ తో లబ్దిదారుల ‘ఇళ్లు’ గుల్లా
అమాంతం పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలు, వేధిస్తున్న కూలీలు, మేస్త్రీల కొరత;
By : Chepyala Praveen
Update: 2025-06-28 10:40 GMT
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు చేదు అనుభవాలు మిగులుస్తోంది. పెరిగిన ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా..మరో వైపు కూలీలు, మేస్త్రీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వర్షాకాలంలో పనులు ప్రారంభించడంతో వాగుల వంకలలో ప్రవాహం ఉంటుందనే కారణంతో ఇసుక ధర అమాంతం పెంచేశారు.
వీటికి తోడు సిమెంట్ బస్తా, స్టీల్ కు కొరత ఏర్పడటంతో వాటి ధరను సైతం వ్యాపారులు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అంతా ఏకకాలంలో పనులు ప్రారంభించడంతో ఇలా జరుగుతోందని పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు.
పెరిగిన ధరలు..
ట్రాక్టర్ ట్రిప్పు బేస్ మెంట్ రాయి(కట్టురాయి) రెండు నెలల క్రితం రూ. 3500 ఉండేది.. ప్రస్తుతం రూ. 4500 కానీ వేయమంటున్నారు. ఒక ట్రిప్పులో 300 వరకూ రాయి వస్తుంది.
టన్ను ఇసుక ధర ఇంతకుముందు రూ. 1100 గా ఉండేది.. ఇప్పుడది రూ. 1400 చేరింది. అది కూడా వారం తరువాత కానీ అందడం లేదు. వర్షాలు ప్రారంభం అయ్యాక ప్రధాన నదుల్లో నీటి ప్రవాహం పెరిగితే ఇసుక సప్లై కష్టమవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ధర కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్నిరకాల సామగ్రి ధర ఆకాశాన్ని అంటింది. వీటికి తోడు లేబర్ కొరత, మేస్త్రీల డిమాండ్ తో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే లబ్దిదారుల జాబితాను విడుదల చేసింది. చాలాచోట్ల వారంతా పనులు ప్రారంభించుకున్నారు.
అయితే ఈ పనులన్నీ వివిధ దశల్లోనే ఆగిపోతున్నాయి. ఒకరోజు పనిచేస్తే.. మూడు రోజులు విరామం ఇవ్వాల్సి వస్తోందని పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు.
‘‘మేము ఈ మధ్య ఇంటి నిర్మాణం ప్రారంభించాము. ఇళ్లు కూల్చివేత దగ్గరి నుంచి, ఇప్పటి వరకూ అనేక ఇబ్బందులు పడుతున్నాము. పియర్స్ గుంతల మొదట కూలీలకే రేట్లు మాట్లాడుకుని బయానా( అడ్వాన్స్) కూడా ఇచ్చాము.
కానీ తరువాత ఐదు రోజులైన పనులు ప్రారంభించలేదు. చివరకు జేసీబీని మాట్లాడుకున్నాము. ఇది కూడా చాలా రోజుల పాటు తిరిగితే కానీ రాలేదు. మరో వైపు కూలీల రేట్లు పెంచారు.
సిమెంట్ బస్తా ధర రూ. 20 పెరిగింది. ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడికి దాకా సిమెంట్ తీసుకువచ్చిన వాటిని ఆన్ లోడ్ చేయడానికి మనుషులు దొరకడం లేదు’’ అని ఓ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు ‘ఫెడరల్’ తో తన అనుభవాలు చెప్పారు
ప్రతిదీ కొరతే..
‘‘నేను దశాబ్ధం నుంచి సిమెంట్, స్టీల్ వ్యాపారం చేస్తున్న కానీ.. ఇప్పుడున్న కొరత ఎప్పుడూ కనిపించలేదు. ముఖ్యంగా స్టీల్, సిమెంట్ విషయంలో చాలా బాగా తెలుసుకుని వస్తున్నారు. ఏదో కడదాము అన్నట్లు వ్యవహరించట్లేదు.
కొన్ని రకాల బ్రాండ్ల స్టీల్ మాత్రమే కావాలని అంటున్నారు. లోకల్ బ్రాండ్ల స్టీల్ ను అసలు వాడటం లేదు. కొన్ని రకాల కంపెనీలకే ఎక్కువ ఆర్డర్ లు వెళ్తున్నాయి. దాంతో అవి స్టీల్ ను సరఫరా చేయలేకపోతున్నాయి.’’ అని హుజురాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి ఎం. మహేశ్ తో ఫెడరల్ తో చెప్పారు.
కొంతకాలం వరకూ నిర్మాణ రంగం చాలా స్థబ్తుగా ఉందని, ప్రస్తుతం ఊపు వచ్చిందని చెప్పారు. కానీ పెరిగిన రేట్లతో నిర్మాణం వ్యయం అనుకున్నదాని కంటే డబుల్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్దిక సాయం చేస్తోంది. ప్రతి ఊరికి కనీసం 20 ఇళ్ల దాకా మంజూరు చేశారు. అంతా ఒకే సమయంలో పనులు ప్రారంభించడంతో లేబర్, మేస్త్రీల కొరతతో పాటు సిమెంట్, స్టీల్, ఇసుక డిమాండ్ కు తగ్గ సప్లై రావట్లేదు.
దీనితో వాటి ధరలు పెరిగిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం ఏ మాత్రం సరిపోయే అవకాశం కనిపించడం లేదు.
‘‘మేము చాలా రోజుల నుంచి భూమి హద్దులకు, పెన్సింగ్ కు రాళ్లు సప్లై చేసేవాళ్లము. కానీ ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం కావడంతోనే ఒకే రోజు 450 ట్రిప్పుల బేస్ మెంట్ రాయి కోసం ఆర్డర్ లు వచ్చాయి.
అంతకుముందు రూ. 3500 కి ట్రిప్పు రాయి సప్లై చేసేవాడిని. కానీ డిమాండ్ తగ్గట్లుగా కూలీలు లేరు. అదనంగా డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తున్నాము. అందుకే రేట్లు పెరిగిపోయాయి.’’ అని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన రాయి కాంట్రాక్టర్ షేక్ మౌలానా ‘ది ఫెడరల్’ తో చెప్పారు.
భీమదేవరపల్లి మండల కేంద్రానికి ఓ క్రషర్ లీజుదారు మాట్లాడుతూ..‘‘ఒక్కరోజే 200 ట్రాక్టర్లు 20 ఎంఎం, 40 ఎంఎం రాయి కోసం వచ్చాయి. అసలు ఇలాంటి డిమాండ్ నేను ఇంతవరకూ ఊహించలేదు’’ అని చెప్పారు.
మూడు రోజుల్లోనే కంకర మొత్తం అయిపోయిందని చెప్పారు. ‘‘ప్రతి రోజు వందలాది కాల్స్ వస్తున్నాయి’’ అని చెప్పారు.
మట్టికొరత..
కొంతమంది ఇళ్లు బేస్ మెంట్ లో నింపడానికి మట్టి కొరత ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఇంతకుముందు బావులు తవ్వే సంస్కృతి ఉండేది. దాంతో ఇళ్ల నిర్మాణానికి గానీ, చిన్న రహదారుల నిర్మాణానికి మొరం విరివిగా లభించేది.
ప్రస్తుతం అంతా బోర్లు వేయడానిక మొగ్గుచూపుతుండటంతో వీటికి బాగా ఇబ్బంది ఏర్పడుతోంది. కొన్ని ప్రదేశాలలో గ్రామాల్లో చెరువులలో మొరం తీసుకెళ్లడానికి ఉత్సాహం చూపుతున్నారు.
అయితే ప్రస్తుతం చెరువుల దగ్గర గత ప్రభుత్వాలు శ్మశానాలు నిర్మించడంతో అక్కడి మట్టిని తీసుకెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. ‘‘పోయి పోయి బొందల గడ్డ’’ తీసుకెళ్లాలా అని ప్రశ్నిస్తున్నారు.
చాలామంది లబ్దిదారులు తమ బావుల దగ్గర ఉన్న చెలక మట్టిని తీసుకురావడం లేదా గుట్టల నుంచి అక్రమంగా తవ్వి సరఫరా చేసే వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. దీని ద్వారా వారి చేతి చమురు వదులుతోంది.
‘‘ప్రభుత్వాలు ఈ విషయం గురించి ఆలోచించాలి. పెరిగిన ధరలతో ఇళ్లు కట్టడం చాలా కష్టంగా మారింది. త్రీడీ టెక్నాలజినీ ప్రజలకు అందుబాటులోకి తేవాలి. వస్తువులను బ్లాక్ చేసి ధరలు పెంచే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని సామాజిక ఉద్యమకారుడు కే. రమేష్ డిమాండ్ చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు అనగానే వ్యాపారులు ప్రతిసారి పాత రేట్లను సవరించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ హయాంలో యుద్ధ ప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం సందర్భంగా ఇదే విధంగా రింగుల రేట్లు రాత్రికి రాత్రి పెంచేశారని చెప్పారు.
అప్పుడు రూ. 60 రూపాయాలు విలువ చేసే గాజు తరువాత రూ. 200కి చేరిందని చెప్పారు. ప్రజలకు మేలు చేద్దామని ఏదో పథకం ప్రారంభిస్తే ఆ ధరలను వ్యాపారులు గిట్టుబాటు కానీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్ర, బీహార్ కూలీల హవా..
ఇందిరమ్మ ఇల్లు కాకుండా సొంతంగా నిర్మించుకోవాలని అనుకుంటున్న వారికి ఆంధ్ర, బిహార్ కూలీలు అందుబాటులో ఉంటున్నారు. అయితే వీరు సాధారణంగా రోజువారీ కూలీకి రావట్లేదు.
ఇంటిని కట్టడానికి సామగ్రి తో సహ ముందే ఒప్పందానికి వస్తున్నారు. అలాగే కొంతమంది హౌజింగ్ కాంట్రాక్టర్లు కూడా మొత్తం మెటీరియల్ తో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
వీరు ఫీటుకు రూ. 1850 నుంచి రేట్లు మాట్లాడుకుంటున్నారు. యజమాని చెప్పే వస్తువులు, సామాగ్రి తీసుకోవాలనే చెప్పే బ్రాండ్ల విలువతో కలిసి ఒప్పంద పత్రంలో రాసుకుంటున్నారు.
ఇలా మాట్లాడుకుని మూడు నుంచి నాలుగు నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామనే హమీ ఇస్తున్నారు. చాలాచోట్ల వీటిని పూర్తి చేసి ఆ ఫొటోలను గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
కొంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్లు కరీంనగర్, వరంగల్ లో ఇటుక బట్టీలను ఏర్పాటు చేసి, తాము తయారు చేసిన ఇటుకల శాంపిల్ ను తీసుకుని ఇళ్ల నిర్మాణం చేసే లబ్ధిదారులను కలుస్తూ రేట్లు మాట్లాడుకుంటున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకు సరఫరా చేస్తామని హమీలు ఇస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం వ్యాపారులకు లాభాలు తీసుకువస్తుండగా, లబ్ధిదారులు మాత్రం పెరిగిన రేట్లతో లబోదిబోమంటున్నారు. కేవలం మేస్త్రీలకే కూలీల ఖర్చు కోసం రూ. 3,70, 000 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా.. కూడా వారు కొన్ని ప్రదేశాలలో వారు దొరకడం లేదు.
మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తవుతుందనుకుంటున్న ఇల్లు సంవత్సరం అయిన పూర్తవుతుందా లేదా అని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం మేల్కొని వస్తువుల రేట్లు తగ్గించే పనితో పాటు కూలీల కొరత లేకుండా ఏదైన మార్గం ఆలోచించాలని కోరుతున్నారు.