తెలంగాణలో ప్రతీ పనికీ ఫిక్స్‌డ్ రేట్లలో లంచం

తెలంగాణలోని సర్కారు కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు పెచ్చు పెరిగాయి.;

Update: 2025-06-03 11:01 GMT
ఏసీబీ కార్యాలయం

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) 2025 మే నెలలో రికార్డు స్థాయిలో 33 కేసులు నమోదు చేసింది. అంటే గతంలో కంటే ఆల్ టైమ్ రికార్డు. అందులోనూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 11 ఏళ్లు ముగిసి 12 వసంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ 11 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలు పెరిగాయని ఏసీబీ, విజిలెన్స్ కేసులను పరిశీలిస్తే విదితమవుతుంది. తెలంగాణ ఆవిర్భవించాక అవినీతి అధికారులపై కేసులు నమోదవుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ఆరోపించారు. దీంతో ప్రభుత్వ శాఖల్లో అవితీని కేసులతోపాటు అక్రమాల బాగోతాలు పెరిగాయి.

- 2025 మే ఒక్క నెలలోనే 33 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. 14 ట్రాప్ కేసులు, ఆకస్మిక తనిఖీల్లో 25 మంది ప్రభుత్వ అవినీతి అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి పంపించింది. రూ.3.63 లక్షల అవినీతి సొమ్మును ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.



 లంచం వసూళ్ల కేసులెన్నో....

మే 26 : ఖమ్మం జిల్లాలోని ఖమ్మం గ్రామీణ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ఓ వ్యక్తి తన పేరు మీద ఉన్న భూమిని గిఫ్ట్ డీడ్ కింద కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయించేందుకు రూ.50వేలు డిమాండ్ చేసిన సబ్ రిజిష్ట్రార్ జెక్కి అరుణ, ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ లను ఏసీబీ అధికారుల రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సబ్ రిజిష్ట్రార్ నుంచి రూ. 25వేలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన ఏసీబీ వీరిని అరెస్ట్ చేశారు.



 మే 31 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ మల్లోజి నాగరాజు భూమి సర్వే నివేదిక జారీ చేయడానికి రూ.85వేల లంచం డిమాండ్ చేసి. అందులో రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.రూ.15వేల లంచం సొమ్ముతో సర్వేయర్ నాగరాజును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

మే 28 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జి కృష్ణ ఓ రైతుపట్టాదార్ పాస్ పుస్తకంలో 7 గుంటల భూమిని నమోదు చేపించేందుకు రూ.12 లక్షల లంచం డిమాండ్ చేసినందుకు అతన్ని ఏసీబీ అధికారలుు అరెస్ట్ చేశారు.
మే 28 : హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ తహసీల్దారు కార్యాలయంలో కుటుంబసభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేసేందుకు లక్ష రూపాయల డబ్బును రెవెన్యూ ఇన్ స్పెక్టర్ భూపాల మహేష్ డిమాండ్ చేసి రూ.25వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు.



 ప్రభుత్వానికి నివేదికలు పంపినా అక్రమార్కులపై చర్యలేవి?

తెలంగాణలో 2025 ఏప్రిల్ నెలలో ఏసీబీ 16 కేసులు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసులపై ప్రభుత్వానికి నివేదిక పంపించింది.ఈ ఏడాది (2025) జనవరి నుంచి మే నెల వరకు అయిదు నెలల కాలంలో ఏసీబీ 112 కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలను పంపించింది. ఏసీబీ పెండింగ్ కేసుల దర్యాప్తునకు ప్రత్యేకంగా దర్యాప్తు అధికారులను నియమించి విచారణను వేగిరం చేసింది.గత రెండేళ్లుగా ఏసీబీలో కేసులు పెండింగులో ఉన్నాయి.ఏసీబీ పనితీరును మెరుగుపర్చేందుకు వీలుగా ఆదిలాబాద్ రేంజ్ పరిధిలోని మంచిర్యాలలో కొత్తగా ఏసీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

అక్రమాల్లో ఈ శాఖలు టాప్
తెలంగాణ రాష్ట్రంలో రవాణశాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, ఇంజినీరింగ్ విభాగాలు, హెచ్ఎండీఏ, ఎక్సైజ్,ప్రొహిబిషన్ శాఖల్లో అక్రమాలు అధికంగా సాగుతున్నాయని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులే స్పష్టం చేస్తున్నాయి.లంచం సొమ్ము తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా, సంపాదనకు మించి ఆస్తులు సంపాదించిన అవినీతి అధికారులపై ఏసీబీ కేసులు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు.ఏసీబీ కేసులున్న వారిపై చర్యలు తీసుకోవాలని తాము తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాసినా ప్రభుత్వం అవినీతిపరులపై చర్యలు తీసుకోలేదు.

అవినీతి అధికారులకు పదోన్నతులు
ఏసీబీ కేసులున్న అవినీతి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. అక్రమార్కులపై చర్యలు తీసుకోక పోగా, అవినీతికి పాల్పడిన అధికారులపై ఏసీబీ కేసులున్నా, వారికి పదోన్నతులు కల్పిస్తుంది.దీంతో అవినీతి అధికారులు తమ లంచాల వసూళ్ల పర్వాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. డీసీటీఓ జి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు పెండింగులో ఉన్నా పదోన్నతి ఇచ్చారు. మరో డీసీటీఓ డి శ్రీనివాసరెడ్డి పై ఏసీబీ కేసు ఉన్నా తనకు ప్రమోషన్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించి ఉత్తర్వు తెచ్చుకున్నారు. ఇటీవల పలు అవినీతి అధికారులపై ఏసీబీ కేసులున్నా వారికి పదోన్నతులు కల్పించింది.సీటీఓ గీత కూడా పదోన్నతి కోసం కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఏసీబీ, విజిలెన్స్ కేసులున్న అధికారులకు పదోన్నతులు ఇవ్వవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కేసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. లంచం ఇవ్వనిదే కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనులు కావడం లేదు.

1230 విజిలెన్స్ నివేదికలపై చర్యలేవి?
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దర్యాప్తు చేసి వీటిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినా, సంబంధిత అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ సర్కారు తాత్సారం చేస్తుంది. 2014వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ప్రభుత్వ శాఖల్లో జరిగిన అక్రమాలపై 1230 నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.విజిలెన్స్ దర్యాప్తు నివేదికలపై చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకుండా, విజిలెన్స్ దర్యాప్తు నివేదికలను బుట్టదాఖలా చేసిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు.

అవినీతిలో మున్సిపల్ శాఖ అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అక్రమాల్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అగ్రస్థానంలో నిలిచింది. మున్సిపాలిటీల్లో 284 మంది అధికారులపై విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలతో నివేదికలు సమర్పించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. రెవెన్యూ శాఖలో 174 మంది అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ దర్యాప్తులో తేలినా వారిపై కూడా చర్యలు తీసుకోలేదు. అక్రమాల్లో రెవెన్యూశాఖ రెండవ స్థానంలో నిలిచింది. గ్రామీణాభివృద్ధి శాఖపై 142 , వ్యవసాయ, సహకార శాఖలపై 110, నీటిపారుదల శాఖలో 73, పౌరసరఫరాల శాఖలో 64, పర్యావరణ,అటవీశాఖలో 61, వైద్యఆరోగ్య శాఖలో 47 అక్రమ బాగోతాలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. ఈ నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రభుత్వ శాఖల్లో కుంభకోణాలపై 718 విజిలెన్స్ నివేదికలు
తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో జరిగిన కుంభకోణాలపై విజిలెన్స్ విభాగం అధికారులు దర్యాప్తు జరిపి 768 నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కొన్ని శాఖల అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని విజిలెన్స్ విభాగం తేల్చిచెప్పినా దీనిపై సర్కారులో స్పందన లేదు.

చీఫ్ సెక్రటరీ, సీఎంలకు లేఖలు రాసినా...
తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో జరిగిన అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ విభాగాల అధికారులు దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు లేఖలు రాశారు. లేఖలు రాసినా దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పద్మనాభరెడ్డి చెప్పారు.ఏసీబీ, విజిలెన్స్ కేసులున్న అవినీతి అధికారులపై చర్యలు తీసుకోక పోగా కేసుల్లో ఉన్న వారికి ప్రమోషన్లు కూడా ఇచ్చారని పద్మనాభరెడ్డి చెప్పారు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏసీబీ, విజిలెన్స్ విభాగం అధికారులు అవినీతి అధికారులపై దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినా, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.అక్రమార్కులపై సర్కారు చర్యలు తీసుకోక పోవడంతో అవినీతి పరులు ఉద్యోగాల్లో కొనసాగుతూ ఎక్కువ అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.


Tags:    

Similar News