కర్రెగుట్టలు మావోయిస్టుల చేయి జారిపోయినట్లేనా ?
800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేంద్రప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది;
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదేఅనుమానం పెరిగిపోతోంది. విషయంఏమిటంటే ఒకపుడు మావోయిస్టులకు పెట్టనికోటలాగ ఉండే కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో ఇపుడు ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతాదళాలు పాగవేశాయి. గట్టిగా చెప్పాలంటే కర్రెగుట్టల నుండి మావోయిస్టులను భద్రతాదళాలు తరిమేశాయి. తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని 800 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన దట్టమైనఅడవులు దశాబ్దాలుగా మావోయిస్టులకు పెట్టనికోటలు. దండకారణ్యంలో కీలకంగా ఉండే కర్రెగుట్టలు మావోయిస్టులకు బలమైన షెల్టర్ జోన్ గా ఉండేది. అలాంటిది కర్రెగ్గుట్టలను నాలుగువైపులనుండి సుమారు 20వేలమంది భద్రతాదళాలు చుట్టుముట్టేశారు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఎన్ కౌంటర్లు జరిగి మావోయిస్టులు చనిపోతునే ఉన్నారు. మావోయిస్టుల ఏరివేతకు భద్రతాదళాలు గతంలో ఇంతస్ధాయిలో అడవులను ఎప్పుడూ జల్లెడపట్టలేదు.
తాజా సమాచారం ఏమిటంటే కర్రెగుట్టల్లో మావోయిస్టులు అడుగుపెట్టకుండా చేయాలని కేంద్రప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే మొత్తం 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేంద్రప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. నిజానికి ఈఅడవులన్నీ వేలాది వృక్షజాతులు, జంతువులు, అరుదైన పక్షిజాతులు, విలువైన ఖనిజాలు, గనులు, నదులు, సెలయేళ్ళతో నిండి ఉంది. అలాగే వందలాది పెద్ద, చిన్నా గుహలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటినీ బేస్ చేసుకుని చక్కని పర్యాటక ప్రాంతాలుగా, ట్రెక్కింగ్ పర్యాటకం, రిసార్టులు, హోటళ్ళు నిర్మించి అడ్వెంచర్ టూరిజం పేరుతో పర్యాటకులను ఆకర్షించాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. కర్రెగుట్టలు మొత్తం కొండలు, లోయలతోనే నిండి ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని మొత్తం 800 చదరపు కిలోమీటర్లనూ పర్యాటక ప్రాంతంగా సిద్ధం చేసేయాలన్నది కేంద్రం ప్లాన్. దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణా కేంద్రాన్ని కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నది.
అంతేకాకుండా మావోయిస్టులు మళ్ళీ ఇటువైపు తిరిగి చూసే అవకాశం లేకుండా కర్రెగుట్టల్లో ప్రతి 5 కిలోమీటర్లకు భద్రతాదళాలకు ఒక బేస్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈబేస్ లో 500 మందికి తక్కువకాకుండా 24 గంటలూ భద్రతాదళాలు క్యాంపుంటాయి. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపు ఉంటుంది కాబట్టి టూరిజంగా కూడా ఈ అడవులను పర్యాటక ప్రాంతంగా అద్భుతంగా తీర్చిదిద్ద వచ్చన్నది కేంద్రం ప్లాన్. ఎలాగూ ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ ఉంటుంది కాబట్టి పర్యాటకులు భద్రతవిషయంలో భయపడాల్సిన అవసరంలేదు.
కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దటంలో భాగంగానే ముందుగా రోడ్లు, లైట్లు ఏర్పాటుచేయబోతున్నది. దీనివల్ల రవాణా సౌకర్యాలు ఏర్పడుతాయి. రవాణ సౌకర్యాలు ఏర్పాటైతే జనాల రాకపోకలు పెరిగిపోతాయి. జనాలతో పాటు ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ కోసం ఇప్పటికే మొబైల్ టవర్లను ఏర్పాటుచేస్తోంది. రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్ ఏర్పడిన తర్వాత భద్రతాచర్యలు కూడా తీసుకుంటే బయటజనాలు ధైర్యంగా కర్రెగుట్టల్లో సంచారం మొదలుపెడతారు. అప్పుడు మావోయిస్టులకు కాలుపెట్టే అవకాశం కూడా ఉండదు. ఇదంతా అవటానికి ఎంతకాలం పడుతుందో తెలీదుకాని మొత్తానికి కేంద్రప్రభుత్వం దీర్ఘకాల ప్రణాళికతోనే ముందుకు అడుగులు వేస్తున్న విషయం అర్ధమైపోతోంది.