సమాధానాలు వెతుక్కుంటున్న కేసీఆర్..
జూన్ 5న పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరకావాల్సి ఉండగా.. ఆగమేఘాలపై ఒకరి తర్వాత ఒకరితో ఆయన భేటీ కావడం కీలకంగా మారింది.;
కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కేసీఆర్లో టెన్షన్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే సమాధానాలు వెతుక్కునే పనిలో ఆయన నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒకవైపు కేటీఆర్, హరీష్ రావులతో వరుస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు హరీష్ రావుతో భేటీ అయిన కేసీఆర్.. తాజాగా బుధవారం మరోసారి భేటీ అయ్యారు. కేసీఆర్ పిలిస్తేనో, తనంతట తానుగానే అయినా ఈరోజు ఉదయం హరీష్ రావు.. ఎర్రవల్లి ఫామ్హౌస్కు చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు కేసీఆర్, హరీష్ రావులు సమావేశమయ్యారు. ఇందులో అనేక అంశాలపై చర్చించుకున్నారు. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే ఈ భేటీలో భాగంగా కొందరు రిటైర్డ్ ఇంజినీర్లతో కూడా కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.
అంతా తానేనన్న కేసీఆర్..!
అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ను అంతా తానై కట్టించానన్న కేసీఆర్.. ఇప్పుడు ఇంతమందితో భేటీ కావడం ఒంకింత ఆశ్చర్యంగా ఉంది. ప్లానింగ్, ప్రిపేరింగ్ అంతా దగ్గరుండి చూసుకున్నానని, కుర్చీ వేసుకుని కుర్చుని మరీ కట్టించానని అప్పట్లే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. అలాంటిది ఇప్పుడు జూన్ 5న పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరకావాల్సి ఉండగా.. ఆగమేఘాలపై ఒకరి తర్వాత ఒకరితో ఆయన భేటీ కావడం కీలకంగా మారింది. ఇందులో కమిషన్ విచారణలో ఇంజినీర్లు ఏం సమాధానాలు చెప్పారు? అని కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
నివేదికలపైనా ఫోకస్
విచారణలో ఏం చెప్పాలనే కాకుండా.. ఇప్పటి వరకు ప్రభుత్వానికి చేరిన నివేదికల్లో ఏం పేర్కున్నారు అన్న అంశంపై కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ ఇప్పటికే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్ట్ల నాణ్యతపై నివేదికను అందించింది. దీంతో అందులో ఎలాంటి విషయాలు ఉన్నాయి అన్న విషయంపై కేసీఆర్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. వాటికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు, ఎలాంటి సమాధానాలు చెప్పాలి అన్న విషయాలు కూడా హరీష్తో జరిగిన చర్చలో వచ్చినట్లు తెలుస్తోంది.
కవిత సమస్యపై కూడా
వీటితో పాటే రాష్ట్రమంతా తీవ్ర చర్చలకు దారితీస్తున్న కవిత ఎపిసోడ్పై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కవితపై యాక్షన్ తీసుకోవాలా? మందలించాలా? అన్న విషయాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం.