కేటీఆర్ గుట్టంతా మొబైల్లోనే ఉందా ?

మాంత్రికుడి ప్రాణం చిలకలోనో లేకపోతే చెట్టు తొర్రలోనే ఉన్నట్లు మనం చాలా జానపద సినిమాల్లో చూసే ఉంటాము.;

Update: 2025-06-18 12:58 GMT
KTR

మాంత్రికుడి ప్రాణం చిలకలోనో లేకపోతే చెట్టు తొర్రలోనే ఉన్నట్లు మనం చాలా జానపద సినిమాల్లో చూసే ఉంటాము. ఇప్పటి నవీన గాడ్జెట్ల యుగంలో చిలకలు, చెట్టుతొర్రలు పోయి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ చేరాయి. ఇపుడు విషయం ఏమిటంటే మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గుట్టంతా మొబైల్ ఫోన్లోనో లేకపోతే ల్యాప్ టాప్ లోనే ఉన్నట్లుంది. అందుకనే మొబైల్, ల్యాప్ టాప్ ఇవ్వటానికి కేటీఆర్ ఏమాత్రం ఇష్టపడటంలేదు. విషయం ఏమిటంటే ఫార్ముల ఈ కార్ రేసు(Formula E Car Race) కేసులో కేటీఆర్ ను విచారించిన ఏసీబీ అధికారులు వర్కింగ్ ప్రెసిడెంట్ 2023 ఎన్నికల సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను తెచ్చివమన్నారు. అయితే పై రెండు గ్యాడ్జెట్లను ఏసీబీ అధికారులకు ఇవ్వటానికి కేటీఆర్ ఏమాత్రం ఇష్టపడటంలేదు.

ఏసీబీ అడిగినట్లు ఫోన్, ల్యాప్ టాప్ ఇవ్వటం కేటీఆర్ ఇవ్వటానికి ఎందుకు ఇష్టపడటంలేదు ? తాను ఉపయోగించిన మొబైల్, ల్యాట్ టాప్ ను దర్యాప్తు అధికారులకు ఇవ్వకుండా ఉండే మార్గాలను లాయర్లతో చర్చిస్తున్నారు. ఏసీబీ(Telangana ACB) అధికారులు చెప్పిన ప్రకారం బుధవారం సాయంత్రంలోగా మొబైల్, ల్యాప్ టాప్ ను అందించాల్సుంది. అసలు కేటీఆర్ ఉపయోగించిన మొబైల్, ల్యాప్ టాప్ తో ఏసీబీ అధికారులకు ఏమిపని ? పని ఏమిటంటే మామూలుగా ఏ మంత్రయినా శాఖాపరమైన విషయాలపై ఫైల్ రన్ చేయాలంటే నోట్ ఫైల్ రూపంలో రాతకోతలు సాగిస్తారు. అయితే కేటీఆర్ ఏమిచేశారంటే ఫార్ములా కంపెనీకి బదిలీచేయాల్సిన రు. 45 కోట్ల వ్యవహారాన్ని నోట్ ఫైల్ రూపంలో కాకుండా మొబైల్ ఫోన్ ద్వారా ఆదేశాలతో పనికానిచ్చేశారు. ఈవిషయాన్ని గతంలో విచారణకు హాజరైన అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ, కేసులో ఏ2 నిందితుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ చెప్పారు.

తాజా విచారణలో కేటీఆర్ కూడా ఆ విషయాన్ని అంగీకరించారు. తాను అర్వింద్ కు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చినట్లు అంగీకరించారు. ఫోన్ ద్వారా అంటే ఇక్కడ మళ్ళీ నాలుగు రకాలున్నాయి. మొదటిది మొబైల్ లో అర్వింద్ తో మాట్లాడినపుడు ఆదేశాలు జారీచేయటం. రెండో మార్గం మొబైల్ లోనే ఎస్ఎంఎస్ రూపంలో ఆదేశాలు ఇవ్వటం. మూడో మార్గం ఏమిటంటే వాట్సప్ కాల్ మాట్లాడి ఆదేశాలు జారీచేయటం. నాలుగో మార్గం వాట్సప్ చాట్ రూపంలో ఆదేశాలు ఇవ్వటం. ఇందులో వాట్సప్ చాటింగ్ రూపంలో ఆదేశాలు తనకు వచ్చినట్లు అర్వింద్ చెప్పారు కాని కేటీఆర్ ఆ విషయం చెప్పలేదు. సింపుల్ గా మొబైల్ లో ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారంతే.

ఏరూపంలో మొబైల్ ద్వారా ఆదేశాలు జారీచేశారనే విషయంపై క్లారిటీ రావాలంటే ఏసీబీ అధికారులకు కేటీఆర్ ఉపయోగించిన మొబైల్ చాలా అవసరం. అందుకనే దర్యాప్తు అధికారులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపయోగించిన మొబైల్, ల్యాప్ టాప్ కావాలని అడిగింది. అయితే కారణాలు తెలీదుకాని వాటిని ఇవ్వటానికి కేటీఆర్ ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఇదేవిషయమై కేటీఆర్ లాయర్లతో మాట్లాడినపుడు కోర్టుఉత్తర్వులు లేకుండా మొబైల్ ఫోన్లు అడిగే, తీసుకునే హక్కు ఏసీబీకి లేదని చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం. గతంలో హైకోర్టు, సుప్రింకోర్టు తీర్పుల ప్రకారం కేటీఆర్ తన మొబైల్, ల్యాప్ టాప్ ను ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా టాక్ వినబడుతోంది. వీళ్ళ సలహా, సూచనలు బాగానే ఉందికాని మొబైల్ ఫోన్లో రహస్యాలు ఏమీ లేనపుడు ఏసీబీ అధికారులకు దాన్ని అందించటానికి కేటీఆర్ కు ఉన్న అభ్యంతరాలు ఏమిటి ? అనే చర్చకూడా పెరిగిపోతోంది. ఇంతకీ కేటీఆర్ మొబైల్లో ఉన్న రహస్యం ఏమిటనేది మొబైల్ అందిస్తేకాని బయటపడదేమో.

Tags:    

Similar News