బీజేపీని రాజాసింగ్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా..!

ఎవరి వల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో చెప్తా. ప్రతి ఒక్కరి నిజస్వరూపం ప్రజల ముందు ఉంచుతానన్న రాజాసింగ్.;

Update: 2025-06-03 10:25 GMT

తెలంగాణ బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పక్కలో బల్లెంలా మారారు. సొంత పార్టీని, ఆ పార్టీ నేతలను రాజాసింగ్ కడిగిపారేస్తున్నారు. రాజాసింగ్ పెదవి విప్పడం ఆలస్యం ప్రత్యర్థి పార్టీలపై విమర్శలకన్నా సొంత నేతలను విమర్శిస్తూ, వారిపై ఆరోపణలు చేయడమే ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఇంతకాలం పాటు బీజేపీ ప్రభుత్వం రాకపోవడానికి కూడా సొంత పార్టీ నేతలే కారణమని మండిపడ్డారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో కుమ్మక్కు కావడం వల్లే బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందని ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. తాజాగా కూడా మంచి ప్యాకేజీ వస్తే బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడానికి కూడా కొందరు నేతలు రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దానికి తోడు పాత సామానును పార్టీ నుంచి బయటపడేస్తేనే పార్టీకి కొత్త ఉత్తేజం వస్తుందని కూడా అన్నారు. ఇలా సొంత పార్టీ, పార్టీ నేతలపై ఆయన చేస్తున్న విమర్శలు టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందన్న వార్తలు క్షణాల్లోనే కీలకంగా మారాయి. వీటికి కూడా రాజాసింగ్ తనదైన స్టైల్‌లో బదులిచ్చారు. తనకు నోటీసులు ఇస్తే ఒక్కొక్కరి జాతకాలు బయటపెడతానన్నారు. తనను సస్పెండ్ చేస్తే చుక్కలు చూపిస్తానన్నారు. దీంతో అసలు రాజాసింగ్ ధీమా ఏంటి? అనేది తీవ్ర చర్చలకు దారితీస్తోంది.

బ్లాక్‌మెయిలింగేనా..!

తన వ్యాఖ్యలతో బీజేపీని రాజాసింగ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. కాకపోతే రాజాసింగ్ బ్లాక్ మెయిల్ ఎవరిని చేస్తున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తనపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్న రాష్ట్ర నేతలకా? లేకుండా తనకు నోటీసులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న పార్టీ అధిష్ఠానానికా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. రాజా సింగ్ మాటలను బట్టి చూస్తే మాత్రం ఆయన హెచ్చరికలు బీజేపీ తెలంగాణ నేతలకే అన్నట్లు ఉన్నాయి. తనకు నోటీసులు వచ్చినా, తనను సస్పెండ్ చేసినా ప్రతి ఒక్కరి జాతకాలు బయటపెడతానన్నారు. ఎవరు ఏం ఏం చేశారు? ఎవరి వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగింది? ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతానని అన్నారు.

రాజాసింగ్ సమస్య ఏంటి?

ఈ క్రమంలోనే అసలు సొంత పార్టీపై రాజాసింగ్ చేస్తున్న ఈ పోరాటానికి అసలు కారణం ఏంటి? అనే ప్రశ్న కీలకంగా మారింది. కొందరు విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం అయితే.. 2018లో బీజేపీఎల్పీ నేతగా తనకు అవకాశం కల్పించాలని రాజాసింగ్ కోరడం, అప్పుడు ఆ పదవి ఎవరికీ ఇవ్వకుండా ఐదేళ్లు ఖాళీగా ఉంచడంతో పార్టీకి, రాజాసింగ్‌కు మధ్య చీలికలు మొదలయ్యాయి. దానికితోడు తనకు ప్రాధాన్యత తగ్గుతుండటం, పార్టీ పదవుల్లో కానీ, అవకాశాల్లో కానీ తనకు, తన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తన సలహాలు, సూచనలను పెడచెవిన పెడుతుడటం ఇలా అనేక కారణాలతో పార్టీ తీరుపై రాజా సింగ్ అసహనంగా ఉన్నారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో కూడా రాజాసింగ్ ఇదే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరే ఇతర నేత దొరకలేదా? అని నిలదీశారు.

మీ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారికే పదవులు ఇస్తారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. ‘‘బీజేపీలో సీనియర్ నేతలు, కార్యకర్తలు కనబడం లేదా? మీకు గులాంగిరీ చేసే వాళ్లకే పోస్ట్‌లు, టికెట్లు కేటాయిస్తున్నారు. అలా గులాంగిరి చేయని మిగిలినవాళ్లని పక్కబెడుతున్నారు. టికెట్ అనేది పార్టీకి చేసే సేవను చూసి ఇవ్వాలి కానీ.. మీకు చేసే సేవను చూసి కాదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తెలంగాణ బీజేపీలో చీలికలు, విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయన్న అనుమానాలను రాజాసింగ్ మాటలు బలోపేతం చేస్తున్నాయి.

నేతలను పాత సామానంటూ..!

‘‘పార్టీ నుంచి పాత సామాను బయటకు పోతేనే తెలంగాణలో బీజేపీ పవర్‌లోకి వస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్య భేటీలు అవుతున్నారు. ఇలాంటి సీక్రెంట్ సమావేశలు పెట్టుకుంటే బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుంది. ఇలాంటి విషయాలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టాలి. రహస్య సమావేశాలకు వెళ్తున్నవారిని బయటకు పంపాలి. అప్పుడు తెలంగాణలో బీజేపీ మంచిరోజులు వస్తాయి’’ అని రాజాసింగ్ అన్నారు. అయితే పార్టీ తీరు, పార్టీ నేతల తీరుపై రాజాసింగ్ ఇంతలా విరుచుకుపడటానికి అసలు కారణం ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. నేతలు పార్టీ కోసం కాకుండా స్వలాభం చూసుకోవడమా? తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమా? అనేది రాజాసింగే చెప్పాలి.

నోటీసులపై రాజాసింగ్ ఏమన్నారంటే..

‘‘నాకు నోటీసులు ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తోందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ వార్త నిజమే అయితే నాకు నోటీసు ఇవ్వడం కాదు ఏకంగా సస్పెండ్ చేయండి. అదే చేస్తే అప్పుడు అందరి జాతకాలు బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో చెప్తా. ప్రతి ఒక్కరి నిజస్వరూపం ప్రజల ముందు ఉంచుతా’’ అని అన్నారు.

Tags:    

Similar News