బీఆర్ఎస్ పై రేవంత్ ‘రైతుభరోసా’ సర్జికల్ స్ట్రైకేనా ?
9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయటం నిజంగా గ్రేటనే అనుకోవాలి;
రైతుభరోసా పథకాన్ని అమలుచేయటం ద్వారా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యర్ధిపార్టీలు బీఆర్ఎస్, బీజేపీలకు సర్జికల్ స్ట్రైక్ తరహా షాకిచ్చారు. 9 రోజుల్లో రు. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో రేవంత్ ప్రభుత్వం జమచేసింది. వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే తమఖాతాల్లో తలా రు. 12 వేలు పడటంతో రైతుల్లో సంతోషం కనబడుతోంది. ప్రస్తుత ఆర్ధికపరిస్ధితి కారణంగా రు. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయటం రేవంత్ ప్రభుత్వానికి కష్టమని ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్(BRS) నేతలు అనుకున్నారు. అయితే వీళ్ళ అంచనాలను తల్లకిందులు చేస్తు ప్రభుత్వం 9 రోజుల్లో రు. 9 వేల కోట్లను సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేసింది. రైతుభరోసా నిధులను జమచేయటం ద్వారా 1.46 కోట్ల ఎకరాల్లో సాగుకు రైతులకు పెట్టుబడి సాయం అందించినట్లయ్యింది. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయటం నిజంగా గ్రేటనే అనుకోవాలి.
ఎందుకంటే ప్రతినెలా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం సుమారుగా రు. 12 వేల కోట్లు మాత్రమే. ఇందులోనే అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమపథకాల అమలుకు, ఉద్యోగుల జీత, బత్యాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలి. ఇలాంటి పరిస్ధితిలో రైతుభరోసా(Rytu bharosa)హామీని రేవంత్(Revanth) ఇంత తొందరగా నెరవేరుస్తారని బీఆర్ఎస్ ఊహించలేదు. ఎలాగూ రైతుభరోసా నిధులను చెప్పినట్లుగా 9 రోజుల్లో ఇవ్వలేరు కాబట్టి అప్పటివరకు వెయిట్ చేసి తర్వాత రేవంత్ ప్రభుత్వంమీద ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడాలని బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) అనుకున్నారు. ఇలాంటి సమయంలో కారుపార్టీనేతలు ఊహించినదానికి భిన్నంగా రేవంత్ ప్రభుత్వం రైతులఖాతాల్లో వేలాది కోట్లరూపాయలను జమచేయటంతో ఏమిచేయాలో తెలీక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసంచేసిందని గోల మొదలుపెట్టారు.
నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5.27 లక్షల మంది రైతులకు రు. 718 కోట్లు జమయ్యాయి. తర్వాత ఖమ్మం జిల్లాలో 3.38 లక్షలమంది రైతులకు రు. 428 కోట్లు, సంగారెడ్డిలో రు. 423 కోట్లు, నాగర్ కర్నూలు జిల్లాలో 416 కోట్లు జమ అయ్యాయి. తక్కువగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 25 వేలమంది రైతులకు రు. 24 కోట్లు జమ అయ్యాయి.
చేసి చూపించాము : తుమ్మల
ఎన్నిఇబ్బందులు ఎదురైనా తొమ్మిదిరోజుల్లో రు. 9 వేల కోట్లతో రైతుభరోస హామీని నెరవేర్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala NageswarRao) తెలిపారు. 9 రోజుల్లో రు. 9 వేల కోట్లతో రైతుభరోసా హామీని నెరవేరుస్తామని కొందరు నమ్మలేదని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి పేరు ప్రస్తావించకుండా ఎద్దేవాచేశారు. అసాధ్యమైన హామీని రేవంత్ రెడ్డి సాద్యంచేసి చూపించారని తుమ్మల అన్నారు. ఏడాదిలో తమప్రభుత్వం రైతుల కోసం లక్ష కోట్లరూపాయలు ఖర్చుచేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రైతుభరోసా హామీని నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వాన్ని చూసి బీఆర్ఎస్, బీజేపీలోని కొందరు నేతలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నట్లు మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రు. 2 లక్షల్లోపు రైతు రుణాలను మాఫీచేసినట్లు కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
అన్నదాతకు క్షమాపణ చెప్పాలి : కేటీఆర్, హరీష్
స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు రైతుభరోసా నిధుల విడుదల పేరుతో రేవంత్ ప్రభుత్వం డ్రామాకు తెరలేపినట్లు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు. మ్యానిఫెస్టోలో ఎకరాకు రైతుభరోసా కింద రు. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఎకరాకు రు. 12 వేలు మాత్రమే ఇస్తున్నట్లు మండిపడ్డారు. ఇచ్చిన హామీలో 3 వేల రూపాయలు కోతపెట్టడం రైతులను మోసంచేయటం కాదా అని నిలదీశారు. రైతులకు ఏమాత్రం మేలుచేశారని సంబురాలు చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే రైతుభరోసా రెండుసీజన్లు ఎగ్గొట్టిన విషయాన్ని ఎంఎల్ఏలు గుర్తుచేశారు.
నో పాస్ బుక్..నో భరోసా
రేవంత్ ప్రభుత్వం అమలుచేసిన రైతుభరోసా కొందరు రైతులకు అందలేదు. దీనికి కారణం ఏమిటంటే పట్టాదారు పాసుపస్తకం లేకపోవటమే. రైతుభరోసా నిదులు రైతులఖాతాల్లో జమచేయటానికి ప్రభుత్వం పెట్టుకున్న ప్రామాణికత ఏమిటంటే పట్టాదారు పాస్ పుస్తకాలే. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతుల్లో చాలామందికి రైతుభరోసా నిధులు బ్యాంకుల్లో జమయ్యాయి. అయితే ఇదేసమయంలో కొందరు రైతులకు పట్టాదారుపుస్తకాలు లేకపోవటంతో రైతుల ఖాతాల్లో నిదులు జమకాలేదు. కేసీఆర్ హయాంలో కొందరు రైతుల పట్టాదారుపాసుపస్తకాల్లో మార్పులు జరిగాయి. అలాంటి రైతులు ఇపుడు నష్టపోతున్నారు. ఇదేవిషయమై మహబూబాబాద్ జిల్లా కేశముద్రం పరిధిలోని రైతులు ఆందోళనచేశారు. ధరణిపోర్టల్లో మార్పులకారణంగా పట్టాదారుపాస్ పుస్తకాల్లో నుండి తమపేర్లు మాయమైపోయినట్లు ఆరోపించారు. గడచిన 60ఏళ్ళుగా తాము సుమారు 1900 ఎకరాలను సాగుచేసుకుంటున్నట్లు రైతులు వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని రేవంత్ ప్రభుత్వం వెంటనే సరిచేసి రైతుభరోసా నిధులను తమకు కూడా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. కేశముద్రంలోని రైతుల్లాగే రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లోని మరికొందరు రైతులకు కూడా రైతుభరోసా నిధులు అందలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో చొరవతీసుకుని సదరు రైతులకు న్యాయం చేస్తే బాగుంటుంది.