కేటీఆర్‌ను మాయం చేసిన కవిత

తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో కవిత సొంత కుంపటి పెట్టినట్లేనా..!;

Update: 2025-05-31 12:02 GMT

కొత్త పార్టీ పెడతారో లేదో తెలియదు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత కుంపటి అయితే పెట్టేశారు. తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని శనివారం ఉదయం కవిత ప్రారంభించింది. ఆ కార్యాలయానికి సంబంధించి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అది చూస్తే ఈ విషయం అర్థమైపోతోంది. అదొక్కటే కాదు కవిత తన సొంత కార్యాలయం నుంచి కేటీఆర్‌ను కూడా మాయం చేసేసింది. ఈ తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును చూస్తే.. పార్టీ నుంచి బయటకు రావడానికి కవిత సిద్దంగా ఉందన్న విషయం అర్థమవుతోంది. ఇందులో బీఆర్ఎస్ ఆనవాళ్లు ఏమాత్రం కనిపించక పోవడం కూడా ఒక ఉదాహరణ. కొత్త కార్యాలయంలో మొత్తం కూడా సోషల్ రిఫార్మర్స్ విగ్రహాలే ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఉంది కానీ.. అది గతంలో బీఆర్ఎస్ ఆవిష్కరించిన విగ్రహం లాంటిదే అయి ఉండటం గమనార్హం.

తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసులో కేసీఆర్ ఫొటో మాత్రమే ఉంది. అది కూడా ఒకే ఒక్క ఫొటో గోడకు తగిలించి ఉంది. ఇంకా తెలంగాణ తల్లి విగ్రహం.. బాబాసాహెబ్ అంబేద్కర్.. మహాత్మ జ్యోతిబాపూలే.. సావిత్రిబాయి పూలే.. ప్రొఫెసర్ జయశంకర్ ల విగ్రహాలు ఉన్నాయి. కేసీఆర్ మినహా బీఆర్ఎస్‌కు సంబంధించిన మరేఇతర గుర్తులు కూడా కార్యాలయంలో లేవు. కార్యాలయాన్ని కూడా పూర్తిగా తెలంగాణ జాగృతి ఆఫీస్ అనే చూపించారు. పెద్ద ఫ్లెక్సీ కూడా ఉంది. అందులో కూడా ‘తెలంగాణ జాగృతి.. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని రాసి ఉంది. జాగృతి బ్యానర్‌లో సైతం కేసీఆర్, ప్రొఫెసర్ జైశంకర్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ జాగృతి పేరుకు ఇరు వైపులా తెలంగాణ తల్లి విగ్రహం.. అమరవీరుల స్తూపం కనిపిస్తున్నాయి.

సాధారణంగా ప్రతి నేత కూడా సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఎవరి ఆఫీసును చూసినా వెంటనే వాళ్లు ఏ పార్టీకి చెందిన ఆఫీసును నిర్వహిస్తున్నారో అర్థమై పోతుంది. అలాంటిది శనివారం కవిత ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యాలయం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఏ కోశాన కూడా దానిని బీఆర్ఎస్ పార్టీ నేత కార్యాలయంగా ఎవరూ చెప్పరు. కొత్త ఆఫీసులో ఎక్కడా కూడా పార్టీ రంగు కానీ, గుర్తు కానీ, జెండా కానీ కనిపించలేదు. బీఆర్ఎస్‌కు సంబంధించి కేసీఆర్ ఫొటో తప్ప మరే ఇతర చిహ్నం కూడా తెలంగాణ జాగృతి ఆఫీసులో లేకపోవడం కీలకంగా మారింది.

ఇది కొత్త పార్టీ ఆఫీసా..!

దీంతో కవిత.. బీఆర్ఎస్ నేతగా ఈ ఆఫీసును స్టార్ట్ చేయలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే కొత్త పార్టీ స్థాపన అనే అంశంపై ఫోకస్ పెట్టి ఉన్నారని, అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత తన కొత్త పార్టీ కోసం పరిశీలిస్తున్న పేర్లలో కూడా ‘తెలంగాణ జాగృతి’ అన్న పేరు ఉండటంతో వారి వాదనకు బలం చేకూరుతోంది. అదే క్రమంలో కొత్త ఆఫీసులో రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ విగ్రహం కూడా ఉండటంతో ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ అన్న పేరును కూడా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉన్న విగ్రహాలెవరివి..

తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాలుగు విగ్రహాలు వరుసగా ఉన్నాయి. వాటిలో తొలుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వ్యక్తి. రెండో స్థానంలో రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంది. మూడో స్థానంలో ప్రముఖ సాంఘిక కార్యకర్త జ్యోతిబాఫూలే, మహిళా విద్యకోసం పోరాడిన సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఉన్నాయి. వారితో పాటు తెలంగాణ తల్లి పాత విగ్రహాన్ని ఉంచారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహంపై తన వ్యతిరేకతను కవిత ఇప్పటికీ కనబరుస్తున్నారన్న విషయం తెలుస్తోంది.

Tags:    

Similar News