కవిత టార్గెట్ రీచ్ అయిందా..?
కేసీఆర్ కుటుంబీకులు బీజేపీ పార్టీ ఆఫీసు గేటు దగ్గరకు వచ్చినా తన్నితరిమేస్తామన్న బీజేపీ ఎంపీ.;
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్కు కవిత సంధించిన లేఖాస్త్రం సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపార్టీ ఇదే అంశంపై చర్చించాయి. మాట్లాడాయి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. కవిత లేఖపై అనేక వాదనలు కూడా వినిపించాయి. పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, పదవి లేదన్న ఆక్రోశంతోనే కవిత లేఖ రాశారని కొందరు అంటే, పార్టీ శ్రేణుల కోసం కవిత రిస్క్ తీసుకున్నారని మరికొందరు అన్నారు. ఇంకొందరైతే ఇదంతా కూడా కేసీఆర్ ఆడుతున్న రాజకీయ చదరంగమని కూడా చెప్తున్నారు. ఈ విషయంపై చర్చలయితే చల్లారాయి గానీ.. ఇందులో ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి. తనపై మీడియా ఫోకస్ తగ్గిందని, దానిని పెంచుకోవడానికే కవిత ఈ లేఖ రాశారన్న వాదన ఇప్పటికీ గట్టిగా వినిపిస్తోంది. తాజాగా కవిత లేఖపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. ఆయన కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. మీడియా అటెన్షన్ గ్రాబ్ చేయడానికే కవిత ఈ లేఖ రాశారని ఆరోపించారు. అంతేకాకుండా దీని వెనకున్న మాస్టర్మైండ్ కేసీఆరే అని కూడా విమర్శించారు.
‘‘కవిత లేఖ డ్రామా అంతా కూడా ఆమె వార్తల్లో నిలవడమే లక్ష్యంగా సాగింది. దీని మొత్తానికి స్కెచ్ గీసి ఇచ్చింది కేసీఆరే. అనుకున్న టార్గెట్ను రీచ్ అవ్వడంలో కవిత సక్సెస్ అయింది. బీఆర్ఎస్కు ప్రజాదరణ రోజురోజుకు గాల్లో దీపంలా మారుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించడం కోసం పకడ్బందీగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఇది. ఇది పూర్తిగా ట్రాష్ డ్రామా. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఈ వ్యూహాలన్నీ అమలవుతున్నాయి. కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేయడంలో చాలా ప్రొఫెషనల్. అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు, లేదంటే జుట్టు పట్టి తంతారు అదే వారి రాజకీయం. కేసీఆర్ కుటుంబీకులు బీజేపీ పార్టీ ఆఫీసు గేటు దగ్గరకు వచ్చినా తన్నితరిమేస్తాం’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా పలువురు విశ్లేషకులు కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు కూడా. బీసీ రిజర్వేషన్ అంశం పూర్తయిన తర్వాత బీఆర్ఎస్పై మీడియా ఫోకస్ చాలా తగ్గిందని, దానిని నుంచి పార్టీని బయటపడేయడం కోసం కల్వకుంట్ల కుటుంబం పక్కా ప్లాన్తో ఈ లేఖను విడుదల చేసిందని అంటున్నారు. కవిత రాసిన రెండు వారాల తర్వాత, ఆమె రాష్ట్రంలో లేని సమయం చూసుకుని అందుకే విడుదల చేశారని అంటున్నారు. విమానాశ్రయంలో కవిత చేసిన వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ మాస్టర్మైండ్ ప్లాన్లో భాగమేనని భావిస్తున్నారు. అందుకు పెద్ద ఉదాహరణ.. లేఖ తర్వాత కవితపై పెరిగిన మీడియా ఫోకస్ అని చెప్తున్నారు. ప్రస్తుతం కవిత ఏం చేసిన మీడియాలో హల్చల్ అవుతుందని భావిస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణ జాగృతిని పట్టించుకున్న నాథుడు లేడని, అలాంటిది ఇప్పుడు తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును ప్రారంభాన్ని, ఆమె చేసిన నిరసనను అంతా కవర్ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మీడియా అటెన్షన్ గ్రాబ్ చేయడంలో కవిత సక్సెస్ అయిందనే చెప్పాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.