కాంగ్రెస్ కారణంగా రైతులు పరేషాన్: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని, నీళ్లు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.;
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. అబద్ధాల కాంగ్రెస్ అద్దాల మేడలో ఊరేగుతుంటే.. రైతులు మాత్రం ఆగమాగం అవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ ఒకటి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని, నీళ్లు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. సర్కార్ నిర్లక్ష్యం వల్ల కాలువల్లో నీళ్లకు బదులుగా రైతులు కన్నీరు పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెద్దపీట వేస్తున్నాం అని మాటల్లో చెప్పడమే తప్ప.. వారికి కాంగ్రెస్ చేసిందేమీ లేదంటూ చురకలంటించారు.
కాంగ్రెస్ కుట్రలను బయటపెడతాం..
‘‘కాలం కాటేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాటేస్తున్నది. కరువు కాటేయడం లేదు. కాలువల్లో నీళ్లు వారించకుండా కాంగ్రెస్ కాటేస్తున్నది. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకుండా కక్షగట్టిన సర్కార్ నిర్లక్ష్యం మూలంగా కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయి. అద్దాలమేడలో ఊరేగుతున్న అబద్దాల కాంగ్రెస్ మూలంగా అంధకారంలో తెలంగాణ రైతన్న ఆందోళన చెందుతున్నాడు. దశాబ్దాల పాలనలో దండగ చేసిన వ్యవసాయాన్ని దశాబ్ద బీఆర్ఎస్ పాలనలో పండగ చేస్తే .. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి దండగ చేశారు .. కానీ పండగల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఊరేగుతున్నది. బీఆర్ఎస్ పాలనలో వచ్చిన కాళేశ్వరం నీళ్లు.. కాంగ్రెస్ పాలనలో ఎందుకు రావడం లేదని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఆరువందల మీటర్ల ఎత్తున ఎగిసిన కాళేశ్వరం నీళ్లు సుమారు 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండలంలో రావిచెరువు వరకు చేరి రైతుల పొలాలను తడిపిన నీళ్లు నేడెందుకు పారడం లేదని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. శ్రీరాంసాగర్ కింద 2001లో పూర్తయిన కాకతీయ వరద కాలువ 22 ఏళ్ల తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల మూలంగా 153 కిలోమీటర్లు ప్రయాణించి చివరి ఆయకట్టుకు చేరాయి. కానీ నేడు మేడిగడ్డ మరమ్మతులు చేయకుండా, కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు ఎత్తిపోసి సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వ్యవసాయంపై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కార్ రైతన్నలకు శిక్ష వేస్తున్నది.
కాంగ్రెస్ కుట్రలను చేధిస్తాం. తెలంగాణ రైతన్నలను కాపాడుకునేందుకు నిరంతరం పోరాడతాం’’ అని పేర్కొన్నారు.