హైదరాబాద్లో మహిళా హార్స్ రైడర్స్ దళం
హైదరాబాద్ నగరంలో బందోబస్తు విధుల్లో కొత్తగా 10మంది మహిళా పోలీసులతో కూడిన హార్స్ రైడర్స్ దళం రంగంలోకి దిగింది.;
By : The Federal
Update: 2025-09-05 11:51 GMT
హైదరాబాద్ నగరంలో బందోబస్తు, పెట్రోలింగ్ విధుల కోసం కొత్తగా 10 మంది మహిళా పోలీసులతో కూడిన హార్స్ రైడర్స్ దళాన్ని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ రంగంలోకి దించారు.హైదరాబాద్ పోలీసులతో మహిళా మౌంటెడ్ యూనిట్ను ప్రవేశపెట్టి, డాగ్ స్క్వాడ్ను కూడా సీపీ విస్తరించారు. హైదరాబాద్లో మహిళా గుర్రపు స్వారీదారులను దళంలోకి చేర్చుకోవాలని నిర్ణయించినట్లు సీపీ ప్రకటించారు.
మహిళా పోలీసులకు గుర్రపుస్వారీలో శిక్షణ
ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం నుంచి పది మంది మహిళా కానిస్టేబుళ్లు మౌంటెడ్ పోలీస్ ఫోర్స్లో భాగమయ్యేందుకు గోషామహల్ మౌంటెడ్ యూనిట్లో రెండు నెలల పాటు శిక్షణ పొందారు.ఈ మహిళా కానిస్టేబుళ్లను బందోబస్తు , వీఐపీల కదలికలు,పెట్రోలింగ్ విధులకు వినియోగించనున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలోకి వచ్చేలా ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.ఈ మహిళా మౌంటెడ్ పోలీస్ అధికారులు రెగ్యులర్ పెట్రోలింగ్లో భాగమవుతారని ఆయన తెలిపారు.
డాగ్ స్క్వాడ్ విస్తరణ
హైదరాబాద్ నగర పోలీసులు కూడా తన డాగ్ స్క్వాడ్ను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్లోని 34 జాగిలాలు ఉన్నాయి. అధిక పనిభారంతో ఉన్నందున వీటి సంఖ్యను 54కి పెంచాలని దళం నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో విస్తృత శిక్షణ పూర్తి చేసిన తర్వాత కొత్త జాగిలాలను చేర్చుకుంటారు. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను గుర్తించడానికి, నేరస్థులను ట్రాక్ చేయడానికి ఈ కుక్కలను ఉపయోగించనున్నారు.60 కుక్కల కోసం 11.5 ఎకరాలలో కొత్త డాగ్ కెన్నెల్, మౌంటెడ్ యూనిట్ నిర్మించాలని నిర్ణయించారు.