‘ఢిల్లీ సాక్షిగా గురుదక్షిణ ఇచ్చుకున్న రేవంత్’
బనకచర్లపై చర్చ లేదని బుకాయించి.. గోదావరి నీళ్లను ఏపీకి దారాదత్తం చేశారు.;
ఢిల్లీ వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల భేటీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గుట్టు రట్టయిందన్నారు. రేవంత్ 48వ సారి చేసిన ఢిల్లీ పర్యటనలో ముసుగు వీడిందని, నిజం తేటతెల్లమయిందంటూ పేర్కొన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు అన్న విషయం స్పష్టమైందని, తెలంగాణ వ్యతిరేకి అయిన రేవంత్ను గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు మిగిలింది బూడిదే అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు కేటీఆర్. ‘‘బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు…. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో…ఈరోజుతో తేలిపోయింది. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి… తెలంగాణ విధ్వంసం కావలసిందేనా? ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు? నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో! జై తెలంగాణా అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో! ఒక్క మాట గుర్తు పెట్టుకో… ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావు! ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం! ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం! తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పకపడతాం’’ అని హెచ్చరించారు