‘రేవంత్ ఇప్పటికయినా నీకేం చేతకాదని ఒప్పుమకో’

420 హామీలు, వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసింది.;

Update: 2025-07-08 07:59 GMT

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన సవాళ్లు విసరడం తప్ప మాటపై నిలబడటం అనేది రేవంత్ చరిత్రలో లేదన్నారు. ముచ్చటపడుతున్నారని తామే ప్రెస్ క్లాబ్ బుక్ చేసి చర్చకు రమ్మంటే ఢిల్లీకి పరారయ్యారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం బీఆర్ఎస్ నేతలు ఒక నిమిషం మౌనం పాటించారు. గత 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలన తో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ‘‘నోటికొచ్చిన హామీలు, నోటికి వచ్చిన వచ్చిన వాగ్దానాలు, 420 హామీలు, వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసింది’’ అని విమర్శలు గుప్పించారు.

‘‘ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకు మాది గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద రాసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేకపోయాడు. తెల్లారి లేస్తే అరుపులు, గావుకేకలు, బూతులు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. తెలంగాణ రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు విసిరితే స్వీకరించి నేను వచ్చాను. బేసిన్ నాలెడ్జి లేని రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జి లేదని తెలిసినా కూడా ముఖ్యమంత్రి ముచ్చట పడుతున్నాడు కదా అని సవాల్ ను స్వీకరించాను. బేసిన్ నాలెడ్జ్ , బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టే ఓ 72 గంటల టైం ప్రిపరేషన్ కోసం ఇచ్చి రమ్మన్నాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పాను’’ అని చెప్పారు.

‘‘జులై 8 తారీఖున 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్ కు వస్తాము, మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే ఇవాళ రేవంత్ రాకుండా ఢిల్లీకి పోయిండు. ఒకవేళ ముఖ్యమంత్రి రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గాని, వ్యవసాయ మంత్రి గానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులను పంపుతారని అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు కాని చర్చ చేయడం రాదని ఇవాళ తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది కానీ రైతుల గురించి మాట్లాడడం రాదని స్పష్టంగా తెలిసిపోయింది. రేవంత్ రెడ్డికి బేసిన్ ల గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ లేదు. ఏ ప్రాజెక్టు బేసిన్లో ఉంది అని ఇరిగేషన్ అధికారులను ఒక చిన్న పిల్లాడు అడిగినట్లు అడుగుతుంటే ఇతనా మనకు న్యాయం చేసేదని రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు , కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రాతిపదికను కల్పించారు’’ అని తెలిపారు.

 

‘‘ఈ సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వాడుతున్నాడు. తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతులను మోసం చేస్తూ ఆయన గురువు చంద్రబాబుకు కృష్ణా గోదావరి నీళ్లను పంపిస్తున్నాడు. కింద గోదావరిలో బనకచర్ల కడుతుంటే పచ్చ జెండా ఊపుతున్నడు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకొని చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నాడు. నీళ్లేమో ఆంధ్రకు పోతున్నాయి. నిధులు ఢిల్లీకి పోతున్నాయి. తన తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని రేవంత్ మురిసిపోతున్నాడు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పైసల మూటలు మోసి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నాడన్న సంగతి ఇవాళ తెలంగాణలోని చిన్న పిల్లలకు కూడా తెలుసు. తెలంగాణ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి పేసిఎం అని పేరు పెట్టారు’’ అని వెల్లడించారు.

‘‘రాష్ట్రంలోని ఏ వర్గానికి రేవంత్ రెడ్డి మేలు చేయలేదు. రైతు భరోసాలోని డొల్లతనాన్ని చెబుదామని అధికారిక సమాచారంతో వచ్చా. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో రైతు భరోసా రాని 670 మంది రైతుల పేర్లు, అడ్రస్సులు, ఫోన్ నెంబర్లతో సహా తీసుకొని వచ్చాను. రాష్ట్రంలో రుణమాఫీ కానీ లక్షల మంది వివరాలతో జాబితా తీసుకొచ్చాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న 670 మంది రైతుల వివరాల మా దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితాను తీసుకొని వచ్చా. ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది. ఒక్క ఆధార్ కార్డుతో ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా ఇస్తామంటే చెప్పులను క్యూలో పెట్టి రైతులు ఫర్టిలైజర్ దుకాణాల ముందు ఎదురుచూస్తున్నారు’’ అని అన్నారు.

‘‘మళ్లీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్ధినాలను తీసుకొచ్చింది. కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ఆనాటి రోజులు మళ్లీ ఇప్పుడు వచ్చాయి. ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడే ఆనాటి రోజులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అణిచివేతలు, నిర్బంధాలు అని తెలుసుకన్నారు. 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ ని తలపించేలా ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతుంది. పేదలు, గిరిజనులు, దళితుల మీద దాడులు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును రీ ట్వీట్ చేసినందుకు నల్లబాలు అనే బహుజన బిడ్డను రేవంత్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది.ఆనాటి రోజులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూస్తున్నారు. మార్పు అంటే ఇంత దారుణంగా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు.అందుకే రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని వెల్లడించారు.

 

‘‘మాజీ మంత్రులు, మాజీ హోంమంత్రి, మాజీ అడిషనల్ డీజీపీ ఇంకా ఎందరో బీఆర్ఎస్ నేతలు, నాయకులు, ఎంపీలు, అందరు ముఖ్యమంత్రి గారి కుర్చికి చాలా గౌరవాన్ని ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఆ గౌరవాన్ని నిలుపుకునేలా లేడు. ఆయన చేప్పే పిచ్చి మాటలు, చేసే రోత చేష్టలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. కెసిఆర్ గారిని ప్రతిరోజు ఎలా తిడుతున్నారో ప్రపంచమంతా చూస్తోంది. 2018 లోనూ కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరిండు కానీ ఆ తర్వాత మాట మార్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిండు. జిహెచ్ఎంసి లో బీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు. సవాల్ విసిరిండు. పారిపోయిండు. చర్చకు రమ్మని స్వయంగా ముఖ్యమంత్రే పిలిస్తే నేను వచ్చిన. కాని ఇప్పుడు ఆయనే పత్తా లేకుండా పారిపోయిండు. రైతు శ్రేయస్సు మీద, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అంటే సమగ్ర సమాచారంతో మేము వచ్చాము’’ అని చెప్పారు.

‘‘ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు. అందుకే ఆయనకు మరొక అవకాశం ఇస్తున్నాను. ప్లేసు, డేటు ,టైము, మీరు డిసైడ్ చేయండి. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా వస్తాము. ఏ అంశం మీద చర్చ పెట్టినా చర్చించడానికి కెసిఆర్ తయారుచేసిన గులాబీ దండు సైనికులం తయారుగా ఉన్నాం. సోషల్ మీడియాలో పిల్లలు పోస్టులు పెడితేనే రేవంత్ రెడ్డి గజ గజ వణికిపోతున్నాడు. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నాడ. ఆయనకు కేసిఆర్ కావాలా? రేవంత్ రెడ్డికి కెసిఆర్ అవసరం లేదు. నేనే కాదు మా పార్టీలో ఏ నాయకుడైనా రేవంత్ రెడ్డికి సరిపోతారు. కానీ ఆయన ముచ్చటపడి పేరు తీసిండని నేను వచ్చాను. మైక్ ఇవ్వకుండా అసెంబ్లీలో టైం పాస్ చేస్తానంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. చర్చకు రాలేక పోతే ముక్కు నేలకు రాసి కెసిఆర్ కి క్షమాపణ చెప్పు. తప్పుడు కూతల కూసినందుకు, రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాన్ని తెచ్చిన మహా నాయకుడు కేసీఆర్ ను, భారత దేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంటు ఇచ్చిన కేసీఆర్ ను అడ్డగోలుగా తిట్టినందుకు ముక్కు నెలకు రాయాలి. చర్చకు వచ్చే దమ్ము లేదు. కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి క్షమాపణ చెప్పు. అంతేగాని ఇలాంటి పనికిమాలిన సవాళ్లు పనికిమాలిన డైలాగ్లు ఇంకొకసారి చెప్పకు’’ అని హెచ్చరించారు.

Tags:    

Similar News