తెలంగాణకి ఊరటనిచ్చే కబురు

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారడంతో తెలంగాణను వరదలు ముంచెత్తాయి.

Update: 2024-09-02 10:02 GMT

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారడంతో తెలంగాణను వరదలు ముంచెత్తాయి. శనివారం నుంచి సోమవారం వరకు కుండపోతగా భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వాన ధాటికి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి గ్రామాలు, కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. మరోవైపు పలు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే ట్రాక్లు ధ్వంసం అయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. భయం గుప్పిట్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఊరటనిచ్చే కబురు చెప్పింది.

బంగాళాఖాతంలో వాయుగుండం పూర్తిగా బలహీన పడిందని అధికారులు వాతావరణశాఖ వెల్లడించారు. అయితే రాష్ట్రంలో ఈరోజు, రేపు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం నుంచి మాత్రం మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని రిలీఫ్ ఇచ్చే కబురు చెప్పింది వాతావరణ శాఖ.

అయితే నేడు హైదరాబాద్ లోనూ ఎలాంటి వర్షాలు లేవు. మోస్తరు వర్షం మాత్రమే కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రానికి ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాకు మాత్రం భారీ వర్షం ముంపు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

పది మంది మృతి...

రెండు రోజులపాటు తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా దాదాపు 10 మంది మృత్యువాత పడ్డారు. పశుసంపదకు నష్టం వాటిల్లింది. పంటపొలాలు నాశనమయ్యాయి. అనేకమంది ఆర్ధికంగానూ నలిగిపోయారు. కాగా, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 5లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు రోడ్డు మార్గంలో సీఎం ఖమ్మం బయలుదేరారు. రాత్రి ఖమ్మంలోనే రేవంత్ బస చేయనున్నారు. రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.


Tags:    

Similar News