మిస్ వరల్డ్ పోటీలకు అయిన ఖర్చెంత..?
దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.;
మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలు ముగిశాయి కానీ వీటికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చుపై చర్చ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. రోజురోజుకు మరింత హోరాహోరీగా కూడా మారుతోంది. ఖజానా ఖాళీ అయిందని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అందాల పోటీలకు రూ.250 కోట్లు ఖర్చు చేసిందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితుల్లో లేని సమయంలో అందాల పోటీల నిర్వహణ అవసరమా అని కూడా బీఆర్ఎస్ కీలక నేతలు నిలదీశారు. పైగా ఈ పోటీల వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదని కూడా వ్యాఖ్యానించారు. ప్రపంచ సుందరీమణుల కాళ్లను తెలంగాణ మహిళల చేయతల కడిగించి తెలంగాణ పరువు తీయడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
తాజాగా ఈ విమర్శలు, మిస్ వరల్డ్ పోటీల ఖర్చుపై జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపనల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదన్నారు. ఈ పోటీలకు రూ.250 కోట్లు ఖర్చు అయిందని వారికి ఎవరు చెప్పారు? అని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్, కేటీఆర్కు ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. ‘‘అందాల పోటీలకు అయిన ఖర్చుపై చర్చకు రెడీ. చర్చకు ఎక్కడికి రావాలి? తెలంగాణ భవన్కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలా? ఎక్కడికైనా వస్తా. రూ.200 కోట్లు ఎక్కడ ఖర్చు అయ్యాయో చెప్పాలి. ఖర్చు అయినట్లు నిరూపించని పక్షంలో వాళ్లు ముక్కు నేలకు రాయాలి’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాలెంజ్ చేశారు. తన ఛాలెంజ్కు స్వీకరించడానికి కేటీఆర్, హరీష్ రావుకు వారం రోజుల టైమ్ కూడా పెట్టారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు.. మిస్ వరల్డ్ పోటీలకు అయిన ఖర్చుపై కీలక ప్రకటన చేశారు. మిస్ వరల్డ్ పోటీలసు తమ ప్రభుత్వం నిర్వహించడాన్ని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ. 31 కోట్లు ఖర్చు అయిందని.. స్పాన్సర్ల ద్వారా రూ. 21 కోట్లు వచ్చాయని, మరో రూ. 12 కోట్లు కమిట్మెంట్ ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ. 10 కోట్లు మాత్రమేనని చెప్పారు. విపక్షాల విమర్శలను చూసి నవ్వాలో.. ఏడ్వాలో.. తెలియడం లేదన్నారు. ఒక్కో మిస్ వరల్డ్ కంటెస్టెంట్కు 30 తులాలు కాదు కదా.. మూడు గ్రాములు కూడా ఇవ్వలేదని చెప్పారు. హరీష్ రావు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు అబద్ధం చెప్పలేదని అన్నారు. విపక్షాలు ఏం మాట్లాడుతారో చూద్దామని ఇన్ని రోజులు వేచి చూశామన్నారు. చౌమల్లా ప్యాలెస్లో విందు ప్లేట్కు 1 లక్ష రూపాయల ఖర్చు అనేది అవాస్తవమన్నారు. ప్లేట్కు కేవలం రూ.8,200 ఖర్చు అయిందని చెప్పారు.